భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వివాహం తర్వాత తన ఆటను ఘనంగా ప్రారంభించింది. సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో పీవీ సింధు శుభారంభం చేసింది. సాధికారిక ప్రదర్శనతో దుమ్మురేపింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-14, 22-20తో యున్ సుంగ్(చైనీస్ తైపీ)పై విజయం సాధించింది.
51 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు ఆధిపత్యం చెలాయించింది. తొలి రౌండ్ను అలవోకగా సొంతం చేసుకుంది. అయితే రెండో రౌండ్లో ప్రత్యర్థి నుంచి సింధుకు గట్టి పోటీ ఎదురైంది. ఓదశలో స్కోర్లు సమం కాగా.. సింధు తన అనుభవంతో గేమ్ పాయింట్ సొంతం చేసుకొని విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ గెలుపుతో ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. ఈ రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రారంభమయ్యే ప్రిక్వార్టర్స్లో జపాన్ ప్లేయర్ మనమి సూజుతో సింధు తలపడనుంది.

మరో మ్యాచ్లో అనుపమ ఉపాధ్యాయ 21-17, 21-18తో రక్షితశ్రీపై గెలిచింది. ఆకర్షి కశ్యప్ 17-21, 13-21తో థాయ్లాండ్కు చెందిన పోర్న్పావీ, మాళవిక బాన్సోద్ 22-20, 16-21, 11-21 తేడాతో యూ హాన్(చైనా) చేతిలో ఓటమిపాలయ్యారు.
ప్రణయ్కు చుక్కెదురు..
పురుషుల సింగిల్స్లో స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్తో పాటు ప్రియాన్షు రజావత్కు చుక్కెదురైంది. బుధవారమే జరిగిన తొలి రౌండ్లోనే ప్రణయ్ 21-16, 18-21, 12-21 తేడాతో లీ యాంగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. ప్రియన్ష్ 16-21, 22-20, 13-21 తేడాతో జపాన్కు చెందిన కొడయ్ నరవొక చేతిలో ఓడి ఇంటిదారిపట్టాడు. కిరణ్ జార్జ్ 21-19, 14-21, 27-25 తేడాతో యుషి తనక(జపాన్)ను ఓడించి ప్రీ క్వార్టర్స్కు అర్హత సాధించాడు.
సాత్విక్-చిరాగ్ శుభారంభం..
పురుషుల డబుల్స్లో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సాత్విక్-చిరాగ్ జోడీ 23-21, 19-21, 21-16 తేడాతో మలేషియా ద్వయం వీ చాంగ్-కాయ్ వున్ జంటపై గెలుపొందింది. పృథ్వీ రాయ్-సాయి ప్రతీక్ జోడీ 19-21, 16-21 తేడాతో జపాన్ ద్వయం మిత్సుహాషి-ఒకముర చేతిలో ఓటమిపాలైంది.
మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో శుభారంభం చేసింది. అశ్విని-తనీషా జోడీ 21-11, 21-12 తేడాతో భారత్కే చెందిన కావ్య గుప్తా-రాధిక శర్మపై గెలుపొందింది. ఐదో సీడ్ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీకి మాత్రం చుక్కెదురైంది. గాయత్రి-ట్రీసా 21-23, 19-21 తేడాతో జపాన్ ద్వయం అరిసా-అయాకో చేతిలో ఓటమిపాలైంది.