
హైదరాబాద్: ప్రతిష్టాత్మక క్రీడా అవార్డుల నామినేషన్స్లో మరోసారి తనకు అన్యాయం జరిగిందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్)పై భారత వెటరన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మండిపడ్డాడు. గతేడాది జరిగిన కథనే మళ్లీ రిపీట్ అయిందని, ప్రధాన ఈవెంట్స్లో ఒక్క మెడల్ కూడా గెలవని వారి పేర్లను సిఫార్సు చేశారని ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.
'మళ్లీ అదే పాత కథ. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ చాంపియన్షిప్లో మెడల్స్ గెలిచిన వ్యక్తిని అవార్డుల కోసం అసోసియేషన్ సిఫార్సు చేయలేదు. కానీ ఒక్క ప్రధాన టోర్నీ మెడల్ గెలవని వ్యక్తిని నామినేట్ చేశారు.'అని #waah #thiscountryisajoke అనే ట్యాగ్లతో ప్రణయ్ ట్వీట్ చేశాడు.
ఇక దేశ క్రీడా అత్యున్నత పురస్కారాల దరఖాస్తు గడువు బుధవారంతో ముగుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా సంఘాలు తమ ఆటగాళ్ల పేర్లను సిఫారసు చేసే పనిలో తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం బాయ్ భారత బ్యాడ్మింటన్ పురుషుల స్టార్ జోడీ, ప్రపంచ డబుల్స్ పదో ర్యాంకర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)- చిరాగ్ శెట్టి ద్వయాన్ని అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. వీరితో పాటు సింగిల్స్ ఆటగాడు సమీర్ వర్మను అర్జునకు, కోచ్ ఎస్.మురళీధరన్ను ద్రోణాచార్యకు, గంధె ప్రదీప్, మంజుషా కన్వార్ను ధ్యాన్చంద్ అవార్డుకు సిఫారసు చేసింది.
ఇక గతేడాది కూడా ప్రతిష్టాత్మక అవార్డులకు తన పేరును పరిగణలోకి తీసుకోకపోవడంపై ప్రణయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేశంలో ప్రతిభకు చోటు లేదని మండిపడ్డాడు. ఇక్కడ అవార్డుల నామినేషన్స్కు పెర్ఫామెన్స్లను పరిగణలోకి తీసుకోరని అసహనం వ్యక్తం చేశాడు.
ఇక వరల్డ్ నెంబర్ 10 డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి థాయ్లాండ్ ఓపెన్ సూపర్-500 టోర్నీలో చాంపియన్గా నిలవడంతో పాటు గతేడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో రన్నరప్గా నిలిచింది. గతేడాది సమీర్ వర్మ అంతగారాణించకపోయినా.. 2018లో మూడు టైటిల్స్తో కెరీర్ బెస్ట్ ర్యాంక్ 11 అందుకున్నాడు. 2018 బీడబ్ల్యూఎఫ్ టూర్ ఫైనల్స్కు కూడా వెళ్లాడు.