బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్ ఏడో రోజు భారత అథ్లెట్లు దుమ్మురేపారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా.. రెజర్లు దుమ్మురేపారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-10, 21-9 తేడాతో ఉగాండాకు చెందిన సుసినా కొబుగాబే సునాయాస విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ 21-9, 21-12 తేడాతో శ్రీలంక ప్లేయర్ డుమిందు అబీవిక్రమపై విజయం సాధించాడు.
భారీ అంచనాలతో కామన్వెల్త్ గేమ్స్లో అడుగుపెట్టిన భారత రెజ్లర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, అన్షు మాలిక్... అద్భుత విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లారు. 62 కేజీల మహిళల ఫ్రీ స్టైయిల్ విభాగంలో పోటీపడిన భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్, సెమీ ఫైనల్ మ్యాచ్లో తన ప్రత్యర్థి ఇంగ్లండ్కి చెందిన క్లేజీ బార్న్పై 10-0 తేడాతో భారీ విజయం అందుకుని ఫైనల్కి చేరుకుంది.
అలాగే 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైయిల్ సెమీ ఫైనల్లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా, మారిషస్కి చెందిన జీన్ గలిన్ జోరిస్ని ఒకే నిమిషంలో ఫాల్ఇన్ చేసి ఫైనల్కి అర్హత సాధించాడు. 57 కేజీల మహిళల విభాగంలో పోటీపడిన భారత రెజ్లర్ అన్షు మాలిక్, తన ప్రత్యర్థి శ్రీలంకకు చెందిన నెత్మీ పోరుతోటగేపై సెమీ ఫైనల్ మ్యాచ్లో 10-0 తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. వీరితో పాటు 86 కేజీల ఫ్రీ స్టైయిల్లో పోటీపడిన దీపక్ పూనియా కూడా ఫైనల్ చేరాడు.
సెరా లియోన్కి చెందిన షేకు కసెబమాపై విజయాన్ని అందుకుని సెమీ ఫైనల్కి అర్హత సాధించిన దీపక్ పూనియా, సెమీ ఫైనల్లో 3-1 తేడాతో విజయాన్నందుకుని ఫైనల్ చేరాడు. మరో భారత రెజ్లర్ దివ్య కక్రన్ మాత్రం నైజీరియా రెజ్లర్ బ్లెస్సింగ్ ఒబురుదుదుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పరాజయం పాలైంది. 125 కేజీల ఫ్రీ స్టైయిల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత రెజ్లర్ మోహిత్ గ్రేవల్, సిప్రస్కి చెందిన అలెక్సిస్ కుస్లిడిస్ని ఓడించి సెమీ ఫైనల్కి దూసుకెళ్లాడు. అయితే సెమీ ఫైనల్లో 2-12 తేడాతో కెనడా రెజ్లర్ చేతుల్లో ఓడిన మోహిత్ గ్రేవల్, కాంస్య పతక పోటీలో నిలిచాడు.
టేబుల్ టెన్నిస్లో అచంట శరత్ కమల్ ప్రీ క్వార్టర్లోకి అడుగుపెట్టగా మానికా బత్రా, సాథియన్ తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు. తెలంగాణకు చెందిన ఆకుల శ్రీజ సైతం టోర్నీలో ముందడుగు వేసింది.