బాలి: భారత స్టార్ షట్లర్, వరల్డ్ చాంపియన్ పీవీ సింధు మళ్లీ నిరాశపరిచింది. బీడబ్ల్యూ వరల్డ్ టూర్ ఫైనల్స్ తుదిపోరులో ఓడిపోయింది. ఫలితంగా రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 16-21, 12-21తేడాతో ప్రపంచ ఆరో ర్యాంకర్ సియాంగ్ చేతిలో ఓడిపోయింది. బీడబ్ల్యూ వరల్డ్ టూర్ ఫైనల్స్లో ఇప్పటివరకు మూడుసార్లు తుదిపోరుకు అర్హత సాధించిన సింధు.. చివరిసారిగా 2018లో సింధు టైటిల్ను సొంతం చేసుకుంది.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్కు ముందు పీవీ సింధు.. ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్లో సెమీస్ వరకు మాత్రమే చేరుకోగలిగింది. ఈ టోర్నీ సెమీస్లో నెగ్గి ఫైనల్ చేరిన సింధు.. టైటిల్ ఫైట్లో మాత్రం నిరాశపరిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో ఈ టోక్యో బ్రాంజ్ మెడలిస్ట్ 21-15, 15-21, 21-19 తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యమగూచి (జపాన్)పై పోరాడి గెలిచింది.
డిఫెన్సివ్గా ఆటను ప్రారంభించిన సింధు దక్షిణ కొరియా క్రీడాకారిణికి చాలా అవకాశాలను ఇచ్చింది. దీంతో సియాంగ్ దూకుడుగా ఆడుతూ మ్యాచ్ను తనవైపు తిప్పుకుంది. తొలి సెట్లో కాస్త ప్రతిఘటించిన సింధు రెండో సెట్లో మాత్రం సియాంగ్ దెబ్బకు చేతులెత్తేసింది. దీంతో టైటిల్ను గెలిచే అవకాశాన్ని కోల్పోయింది.