
బాలి: భారత స్టార్ షట్లర్, వరల్డ్ చాంపియన్ పీవీ సింధు.. సెమీఫైనల్స్లో ఎదురవుతున్న ఓటములకు బ్రేక్ వేసింది. ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేషియా మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్లో ఎదురైన సెమీస్ పరాజయాలను మరిచిపోయేలా చేస్తూ.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్ ఫైనల్కు దూసుకెళ్లింది. 2021 సీజన్ను టైటిల్తో ముగించేందుకు అడుగు దూరంలో నిలిచింది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో ఈ టోక్యో బ్రాంజ్ మెడలిస్ట్ 21-15, 15-21, 21-19 తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యమగూచి (జపాన్)పై పోరాడి గెలిచింది. ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ పట్టుదలతో ఆడిన సింధు గంటా 10 నిమిషాల్లో మ్యాచ్ ముగించింది. తొలి గేమ్ ఆరంభంలో 0-4తో వెనకబడ్డ ఈ భారత షట్లర్ బలంగా పుంజుకుంది. తనదైన శైలి ఆటతీరుతో చెలరేగింది. క్రాస్ కోర్టు షార్టులు, డ్రాప్లు, స్మాష్లతో అదరగొట్టింది.
మరోవైపు ప్రత్యర్థి కూడా వెనక్కి తగ్గకపోవడంతో పోరు హోరాహోరీగా మారింది. కానీ కీలక దశలో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 18-15తో ఆధిక్యంలో నిలిచింది. అదే జోరులో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్ సొంతం చేసుకుంది. రెండో గేమ్ తొలి భాగంలోనూ షట్లర్లిద్దరూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో ఓ దశలో 10-10తో స్కోరు సమమైంది. కానీ ఈ గేమ్లో విరామం తర్వాత ప్రపంచ మూడో ర్యాంకర్ యమగూచి జోరు ముందు సింధు నిలవలేకపోయింది.
ప్రత్యర్థి తెలివిగా ఆడుతూ పాయింట్లు రాబట్టి ఆ గేమ్ గెలుచుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో వీళ్లిద్దరి మధ్య పోరు మరో స్థాయికి చేరింది. విజయం కోసం ఇద్దరూ ప్రాణం పెట్టి పోరాడారు. ఓ దశలో 17-12తో సింధు సులువుగానే గెలిచేలా కనిపించింది. కానీ యమగూచి పోరాటానికి సింధు అనవసర తప్పిదాలూ జత కావడం ప్రత్యర్థికి కలిసొచ్చింది. దీంతో 19-19తో చివర్లో తీవ్ర ఉత్కంఠ రేగింది. కానీ తీవ్ర ఒత్తిడిలోనూ మెరుగ్గా ఆడిన ఆమె వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్తో పాటు మ్యాచ్నూ సొంతం చేసుకుంది. తుదిపోరులో ప్రపంచ ఆరో ర్యాంకర్ సియాంగ్తో సింధు తలపడుతుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. సెమీస్లో ఈ యువ షట్లర్ 13-21, 11-21తో ప్రపంచ నంబర్వన్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. ఒలింపిక్ ఛాంపియన్ ముందు సేన్ నిలవలేకపోయాడు. తొలి గేమ్ ఆరంభంలో కాస్త పోటీనిచ్చినప్పటికీ తర్వాత పూర్తిగా వెనకబడిపోయాడు.