న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు ర్యాంక్ దిగజారింది. ఏకంగా మూడు స్థానాలు కోల్పోయిన సింధు 15వ స్థానంలో నిలిచింది. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో జపాన్ షట్లర్ అకానే యమగూచి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
కొరియా షట్లర్ అన్ సే యంగ్, చైనా ప్లేయర్ చెన్ యు ఫే, తైపీ ప్లేయర్ తై జూ యింగ్, చైనా ప్లేయర్ హీ బింగ్ జియావో టాప్-5లో కొనసాగుతున్నారు. మరో భారత షట్లర్ సైనా నెహ్వాల్ 30 ర్యాంకులో నిలిచింది.

గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సింధు అనంతరం గాయంతో ఐదు నెలల పాటు ఆటకు దూరమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీ ఇచ్చినా మునపటిలా సత్తా చాటలేకపోతుంది. లయను దొరకబుచ్చుకోవడంలో ఇబ్బంది పడుతోంది. వరుస టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే ఓటమిపాలైంది.
దాంతో ఈ ఏడాది ఏప్రిల్లోనే టాప్-10 ర్యాంకింగ్స్లో సింధు చోటు కోల్పోయింది. స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీలో ఫైనల్ చేరుకోవడం మినహా ఈ సీజన్లో సింధు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేదు. ఇక సింధు నేడు(జూలై 5) 28వ జన్మదినం జరుపుకుంటోంది. ఇక నుంచైనా మెరుగైన ప్రదర్శన చేయాలని ఆకాంక్షిస్తూ అభిమానులు ఆమెకు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు.
కెనడా ఓపెన్లో సింధు నేడు తన తొలి మ్యాచ్ ఆడనుంది. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో మలేషియా ప్లేయర్ ఎన్జీ యంగ్తో అమీతుమీ తేల్చుకోనుంది.
పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో హెచ్.ఎస్.ప్రణయ్ 8వ ర్యాంక్తో టాప్-10లో కొనసాగుతుండగా.. లక్ష్యసేన్ 19, కిదాంబి శ్రీకాంత్ 20వ స్థానాల్లో కొనసాగుతున్నారు. డెన్మార్క్కు చెందిన విక్టోర్ అక్సెల్సెన్ తన టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. జపాన్ ప్లేయర్ కొడై నారాఓకా టాప్-3లోకి దూసుకొచ్చాడు.
పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్శెట్టి జోడీ మూడో ర్యాంకును నిలబెట్టుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ తరఫున ఈ జోడీదే అత్యుత్తమ స్థానం. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ 17వ ర్యాంకు సాధించింది.