సైనా ఓటమి..
మహిళల సింగిల్స్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. టోక్యో వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ లండన్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్కు చుక్కెదురైంది. రెండోరౌండ్ ప్రత్యర్థి, ప్రపంచ మాజీ చాంపియన్ నొజొమి ఒకుహర (జపాన్) గాయంతో వాకోవర్ ఇవ్వడంతో సైనా నేరుగా మూడోరౌండ్లోకి ప్రవేశించింది. కానీ ఈ అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకోలేకపోయింది.
గంటా నాలుగు నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ మ్యాచ్లో మాజీ వరల్డ్ నెంబర్ వన్ సైనా 17-21, 21-16, 13-21 తేడాతో 12వ సీడ్ బుసానన్ ఓంగారుంగ్ఫాన్ (థాయ్లాండ్) చేతిలో పోరాడి ఓడింది. ఈ మ్యాచ్లో బుసానన్ ఆది నుంచే ఆధిపత్యం చెలాయించింది. దీంతో మొదటి గేమ్ను సైనా 17-21తో కోల్పోయింది. అయితే, రెండో గేమ్లో పుంజుకున్న ఈ లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత 21-16తో ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో మూడో గేమ్లో తిరిగి ఆధిక్యంలోకి వచ్చిన బుసానన్ 21-13తో సైనాను ఓడించింది. తద్వారా క్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఇక అంతకుముందు మ్యాచ్లో సైనా.. హాంకాంగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చెయుంగ్ న్గన్ యిను 21-19, 21-9తో ఓడించి ప్రిక్వార్టర్స్ వరకు చేరుకుంది.
డబుల్స్ జోడీల జోరు..
ఇక పురుషుల డబుల్స్లో భారత అన్సీడెడ్ ప్లేయర్లు ధృవ్ కపిల, ఎంఆర్ అర్జున్ దుమ్మురేపుతున్నారు. గురువారం జరిగిన డబుల్స్ ప్రిక్వార్టర్స్లో ధృవ్-అర్జున్ ద్వయం 18-21, 21-15, 21-16 తేడాతో సింగపూర్కు చెందిన కేహెచ్ లోహ్, హెచ్ టెర్రీ జోడీని ఓడించారు.
భారత అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టిలు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్లో కామన్వెల్త్ గోల్డ్ మెడల్ గెలిచిన ఈ ద్వయం 21-12, 21-10 తేడాతో డానిష్ జంట జెప్పీ బే- లాస్సే మోల్హెడేపై గెలుపొందారు. ఇక క్వార్టర్స్లో వీరిద్దరు డిఫెండింగ్ ఛాంపియన్లు అయిన జపాన్ జోడి టకురో హోకి, యుగో కొబయాషితో తలపడనున్నారు.
కిదాంబి చిత్తుగా..:
గతేడాది రన్నరప్, ప్రపంచ మాజీ నెంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ మాత్రం ఈసారి విఫలమయ్యాడు. తనకంటే తక్కువ ర్యాంకర్ చేతిలో ఓటమిపాలై రెండోరౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. 12వ సీడ్ శ్రీకాంత్ 18-21, 17-21తో చైనాకు చెందిన 32వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మ్యాచ్లో ప్రత్యర్థి దూకుడు ముందు పూర్తిగా తేలిపోయిన భారత షట్లర్ కేవలం 34 నిమిషాల్లోనే వెనుదిరిగాడు.