
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్, వరల్డ్ చాంపియన్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) నిర్వహిస్తున్న 'ఐయామ్ బ్యాడ్మింటన్'క్యాంపైన్కు ఈ హైదరాబాద్ అమ్మాయి ప్రచారకర్తగా ఎంపికైంది. ఈ విషయాన్ని బీడబ్ల్యూఎఫ్ బుధవారం ప్రకటించింది. సింధుతో పాటు మరో ఏడుగురు అంతర్జాతీయ షట్లర్లు ఈ క్యాంపైన్ను నిర్వహించనున్నారు. క్రీడాకారులు ఆటను గౌరవించడం, ప్రేమించడం, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా నిజాయితీగా ఆడడం వంటి అంశాలపై ఈ ప్రచారకర్తలు అవగాహన కల్పించనున్నారు.
ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ 'ఏ క్రీడలోనైనా నిజాయితీగా ఆడటమనేది చాలా ముఖ్యం. నీ ఇష్టప్రకారమే నువ్వు ఆటను ఎంచుకున్నావు. దాన్ని ఆడటంలో నువ్వు అమితమైన ఆనందాన్ని పొందాలి. ఆటలో నిజాయితీగా ఉండాలి. అదే నాకు ముఖ్యం. అంబాసిడర్లుగా ఈ విషయాన్ని మేం మరింత బాగా ఆటగాళ్లలోకి తీసుకెళ్లాలి. ఇలా అయితేనే ఈ విషయం ఎక్కువ మంది ఆటగాళ్లకు చేరుతుంది'అని 24 ఏళ్ల సింధు పేర్కొంది. ఈ ప్రచార కార్యక్రమానికి సింధుతో పాటు మిచెల్లీ లీ (కెనడా), జెంగ్ సీ వీయ్, హంగ్ యా కియాంగ్ (చైనా), జాక్ షెఫర్డ్ (ఇంగ్లండ్), వలెస్కా ఖోబ్లాచ్ (జర్మనీ), చాన్ హో యున్ (హాంకాంగ్), మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
వీరికన్నా ముందు బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు పౌల్ ఎరిక్ హోయర్, బీడబ్ల్యూఎఫ్ పారాలింపిక్ అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్ రిచర్డ్ పెరోట్, బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, విక్టర్ అక్సెల్సన్, హెండ్రా సతియావాన్, క్రిస్టినా పెడెర్సన్, చెన్ లాంగ్, మిసాకి మత్సుతోమో, అకయా తకహాషి 2016 నుంచి ఈ క్యాంపైన్ను ముందుండి నడిపించారు. ఈ సమష్టి ప్రయత్నం ద్వారా బ్యాడ్మింటన్ క్రీడా లోకంలో అవగాహన పెంచడమే కాకుండా ఆట సమగ్రతను కాపాడటంలో ఆటగాళ్లను చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు అని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది.