న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు క్వాలిఫై అవ్వాలని అతృతగా ఉన్న ఇండియా స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్కు షాక్ తగిలేలా ఉంది. ఈనెల 25 నుంచి జరిగే మలేసియా ఓపెనర్ టూర్ సూపర్ 750 టోర్నీలో ఈ ఇద్దరితో పాటు ఇండియా బ్యాడ్మింటన్ టీమ్ పోటీ పడే అవకాశం కనిపించడం లేదు. ఇండియా టీమ్.. మలేసియా వచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతివ్వలేదు.
రంగంలోకి దిగిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్).. సెంట్రల్ స్పోర్ట్స్, ఎక్స్టర్నల్ ఎఫైర్స్ మినిస్ట్రీలతో కలిసి మలేసియా ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఇండియా సింగిల్స్, డబుల్స్ టాప్ ప్లేయర్లు పీవీ సింధు, సైనా, శ్రీకాంత్, సాయి ప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి మలేసియా ఓపెన్లో పోటీపడాల్సి ఉంది.
కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో ఏప్రిల్ 28 నుంచి భారత విమానాలపై మలేసియా, సింగపూర్లు నిషేధం విధించాయి. ''మలేసియా వచ్చేందుకు భారత జట్టుకు అనుమతివ్వాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా క్రీడల శాఖ ఆ దేశ ప్రభుత్వాన్ని సంప్రదించింది. ప్రస్తుతానికి భారత జట్టు ప్రయాణం సాధ్యంకాదంటూ మలేసియాలోని భారత హైకమిషన్కు అక్కడి ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. అయితే టోర్నీకి ఇంకా 19 రోజుల సమయం ఉన్నందున మలేసియాకు వెళ్లే అవకాశాల్ని పూర్తిగా తోసిపుచ్చలేం'' అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఒలింపిక్స్కు ముందు మలేసియా, సింగపూర్ ఓపెన్లు చివరివి కావడంతో పీవీ సింధు, సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్, సాత్విక్, చిరాగ్శెట్టి, అశ్విని, సిక్కిరెడ్డిలు ఈ టోర్నీల్లో పాల్గొనాలని భావించారు. ఒకవేళ మలేసియా ఓపెన్కు అనుమతి లభిస్తే ఈనెల 10లోపు భారత క్రీడాకారులు కౌలాలంపూర్ చేరుకోవాలి. 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. భారత్ నుంచి నేరుగా ప్రయాణించే అవకాశాలు లేకపోవడంతో దోహా లేదా శ్రీలంక నుంచి భారత క్రీడాకారుల్ని పంపించే ప్రత్యామ్నాయాలను బాయ్ పరిశీలిస్తోంది.