కౌలాలంపూర్: టోక్యో ఒలింపిక్స్పై భారీ ఆశలు పెట్టుకున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ అయిన మలేసియా ఓపెనర్ సూపర్-750 టోర్నీని వాయిదా పడింది. మలేసియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ టోర్నమెంట్ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) శుక్రవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ మే 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్లో జరగాల్సింది.
సింగిల్స్ విభాగంలో ఒక దేశం తరఫున గరిష్టంగా రెండు బెర్త్లు ఖరారు కావాలంటే ఆ దేశానికి చెందిన ఆటగాళ్లు టాప్-16 ర్యాంకింగ్స్లో ఉండాలి. ప్రస్తుతం పురుషుల సింగిల్స్లో భారత్ నుంచి సాయిప్రణీత్ 13వ ర్యాంక్లో, శ్రీకాంత్ 20వ ర్యాంక్లో ఉన్నారు. మహిళల సింగిల్స్లో భారత్ నుంచి పీవీ సింధు ఏడో ర్యాంక్లో, సైనా నెహ్వాల్ 22వ ర్యాంక్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్స్ నుంచి సాయిప్రణీత్కు, సింధుకు 'టోక్యో' బెర్త్లు ఖరారయినట్టే.
మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్లో భాగంగా ప్రస్తుతం ఒకే ఒక టోర్నీ సింగపూర్ ఓపెన్ (జూన్ 1-6) మిగిలి ఉంది. 'టోక్యో' బెర్త్లు దక్కించుకోవాలంటే సింగపూర్ ఓపెన్లో శ్రీకాంత్, సైనా తప్పనిసరిగా టైటిల్స్ సాధించడంతోపాటు ఇతర క్రీడాకారుల ఫలితాల కోసం వేచి చూడాలి. అయితే ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్ ఓపెన్ కూడా జరుగుతుందో వాయిదా పడుతుందో తేలియదు. మరోవైపు మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనలపై క్లారిటీ ఇవ్వాలని బీడబ్ల్యూఎఫ్ను భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోరింది.