
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. హైదరాబాద్లో జరుగుతున్న నేషనల్ బ్యాడ్మింటన్ క్యాంప్ను కూడా తాకింది. ఈ శిబిరంలో పాల్గొంటున్న డబుల్స్ స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి, ఫిజియో కిరణ్ కరోనా బారినపడ్డారు. ఈ నెల 7న మొదలైన ఈ క్యాంప్లో స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్, శ్రీకాంత్ పాల్గొంటున్నారు.
అయితే ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి మంగళవారం కోవిడ్19 పరీక్షలు నిర్వహించారు. వాటిలో కొన్ని ఫలితాలు గురువారం వచ్చాయి. ఇందులో సిక్కి, కిరణ్కు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. రెండోసారి చేసినా కూడా పాజిటివ్ వచ్చింది. సింధు, ఆమె తండ్రి, కోచ్ గోపించంద్కు మాత్రం నెగటివ్ వచ్చింది.
గోపిచంద్, కొరియా కోచ్ పార్క్ టీ సాంగ్ ఆధ్వర్యంలో సింధు సపరేట్గా ప్రాక్టీస్ చేయగా, సిక్కి మిగతా ప్లేయర్లతో కలిసి శిక్షణలో పాల్గొంది. అయితే సింధు ప్రాక్టీస్ను పర్యవేక్షించిన గోపీ.. అప్పుడప్పుడు మిగతా ఆటగాళ్లతోనూ కలిశాడు. దీంతో క్యాంప్లో ఉన్న 20 మందికి 'ఆర్టీపీసీఆర్' పరీక్షలు మళ్లీ నిర్వహిస్తున్నట్టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)
గురువారం వెల్లడించింది. శానిటైజేషన్ కోసం గోపీచంద్ అకాడమీని మూసివేసినట్టు కూడా తెలిపింది. అయితే పాజిటీవ్ వచ్చిన సిక్కిరెడ్డి, కిరణ్కు ఎలాంటి లక్షణాలు లేవు.
ఈనెల 7న జాతీయ శిబిరం ప్రారంభమైంది. 'ఆటగాళ్లు, కోచ్లు, సహాయ, పరిపాలన సిబ్బందికి సాయ్ తప్పనిసరి చేసిన కొవిడ్-19 పరీక్షలు నిర్వహించాం. అందులో ఇద్దరికి పాజిటివ్గా తేలింది' అని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ ప్రకటించాడు. 'ప్రొటోకాల్ ప్రకారం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. అందువల్ల తిరిగి వచ్చాక షట్లర్లంతా ఎలాంటి ఆందోళన లేకుండా సాధన చేసుకోవచ్చు' అని గోపి తెలిపాడు.
ఇక తమ అమ్మాయికి కరోనా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని సిక్కిరెడ్డి తండ్రి కృష్టారెడ్డి అన్నారు. 'మా అమ్మాయి సొంత కార్లో ఇంటి నుంచి అకాడమీకి.. అక్కడి నుంచి ఇంటికి తప్ప వేరే ఎక్కడికి వెళ్లలేదు.. అయినా వైరస్ ఎలా సోకిందో అర్థం కావడం లేదు. సిక్కి భర్త సుమీత్, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా టెస్ట్లు చేయించుకున్నారు. శుక్రవారం ఫలితాలు రానున్నాయి. ఇప్పడు వాళ్లంతా ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు'అని కృష్టా రెడ్డి మీడియాకు తెలిపారు.