హైదరాబాద్: భారత మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కి రెడ్డికి, బ్యాడ్మింటన్ బృందం ఫిజియోథెరపిస్ట్ చల్లగుండ్ల కిరణ్కు ఊరట లభించింది. ఇటీవల కరోనా పాజిటివ్గా తేలిన సిక్కి.. రెండో సారి చేయించుకున్న పరీక్షల్లో నెగెటివ్గా తేలింది. ఆమెతో పాటు ఫిజియో థెరపిస్ట్ కిరణ్కు కూడా నెగెటివ్ ఫలితం వచ్చింది. దీంతో సిక్కి,కిరణ్ మాత్రమే కాకుండా బ్యాడ్మింటన్ క్యాంప్కు హాజరైన వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
'నిజంగా ఇదో పెద్ద ఉపశమనం. స్వాతంత్ర్య దినోత్సవం రోజున నాకు నిజంగా స్వాతంత్ర్యం వచ్చినట్టుగా ఉంది. ఇది ముమ్మాటికీ నాకు మంచి వార్త. రెండో సారి టెస్ట్ చేయించుకునేందుకు సహకరించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్)కు ధన్యవాదాలు'అని సిక్కి సంతోషం వ్యక్తం చేసింది.
సిక్కిరెడ్డితో పాటు ఫిజియో డాక్టర్ కిరణ్కు కరోనా పాజిటివ్ రావడంతో గురువారం మధ్యాహ్నం నుంచి నేషనల్ క్యాంప్ను ఆపేసిన గోపిచంద్ అకాడమీని మూసేశారు. శనివారం వచ్చిన రిపోర్డుల్లో అందరికి నెగెటివ్ రావడంతో అకాడమీలో వారితో పాటు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ టెన్షన్ నుంచి రిలీఫ్ పొందారు. అంతేకాక క్యాంప్ను సోమవారం నుంచి పున:ప్రారంభించనున్నారు. అయితే క్యాంప్ రీ స్టార్ట్కు సిక్కీ, కిరణ్ రిపోర్ట్లకు సంబంధం లేదని ఓ అకాడమీ కోచ్ తెలిపారు.
ఈనెల 7న గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో జాతీయ శిక్షణ శిబిరం ప్రారంభమైన సందర్భంగా భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నిబంధనల ప్రకారం శిబిరంతో సంబంధమున్న క్రీడాకారులకు, కోచ్లకు, సహాయక సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో సిక్కి రెడ్డి, కిరణ్లకు కరోనా పాజిటివ్ రాగా... ఇతరులకు నెగెటివ్ వచ్చింది. దీంతో క్యాంప్ను నిలిపివేసి.. శానిటైజేషన్ కోసం గోపీచంద్ అకాడమీని మూసివేసారు. అనంతరం అందరికీ పరీక్షలు చేయగా నెగటీవ్ వచ్చింది.