భారత మహిళల బ్యాడ్మింటన్ టీమ్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్లో తొలి సారి స్వర్ణ పతకం సాధించింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పీవీ సింధు సారథ్యంలోని భారత బ్యాడ్మింటన్ టీమ్ 3-2తో థాయ్లాండ్పై విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది.
2016, 2020 ఆసియా టీమ్ టోర్నీల్లో భారత జట్టు కాంస్య పతకాలు సాధించగా.. భారత మహిళ టీమ్ పతకం సాధించడం ఇదే తొలిసారి కాగా.. అది కూడా స్వర్ణం గెలిచింది.

ఈ టోర్నీ గ్రూప్ దశలో డ్రాగన్ కంట్రీ చైనాపై విజయం సాధించిన సింధూ సేన.. సెమీఫైనల్లో టాప్ సీడ్ జపాన్ను మట్టికరిపించి ఫైనల్కు దూసుకొచ్చింది. థాయ్లాండ్తో జరిగిన ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించిన సింధూ సేన సంచలన ప్రదర్శనతో పసిడి పతకాన్ని ముద్దాడింది.
గాయం నుంచి కోలుకుని రాకెట్ పట్టిన సింధు స్పూర్తిమంతమైన ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించింది. తొలి సింగిల్స్లో సింధు 21-12, 21-12తో సుపనిద కటెథాంగ్పై విజయంతో భారత్ 1-0తో బోణీ కొట్టింది. ఏకపక్షంగా సాగిన పోరులో సింధుకు పోటీనే లేకపోయింది.
డబుల్స్లో గాయత్రి గోపీ చంద్-ట్రీసా జాలీ ద్వయం 21-16, 18-21, 21-16 తేడాతో జోంగ్కోల్ ఫాన్-రవింద జంటను ఓడించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ప్రత్యర్థి జంటపై గాయత్రి- ట్రీసా జోడీ పై చేయి సాధించింది. దాంతో భారత్ ఆధిక్యం 2-0కు చేరింది.
రెండో సింగిల్స్లో అష్మిత చాలిహా 11-21, 14-21తో బుసానన్ చేతిలో చిత్తయ్యింది. రెండో డబుల్స్లో యువ జోడీ శృతి మిశ్రా-ప్రియా జోడీ 11-21, 9-21తో బెన్యపా ఐమ్సార్డ్-నుంతకర్న్ ఐమ్ సార్డ్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. దాంతో ఇరు జట్ల స్కోర్ 2-2తో సమమై డిసైడర్కు దారి తీసింది.
నిర్ణాయాత్మక సింగిల్స్లో యువ ప్లేయర్ అన్మోల్ ఖర్బ్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. గ్రూప్ దశలో చైనా, సెమీస్లో జపాన్ ప్లేయర్లను డిసైడర్ మ్యాచ్ల్లో చిత్తు చేసిన అన్మోల్.. ఫైనల్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తూ సంచలన విజయాన్ని అందించింది. అన్మోల్ 21-14, 21-19 తేడాతో చొయికీవాంగ్పై విజయం సాధించింది.