ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో భారత్ శుభారంభం చేసింది. చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్లో భారత్ 5-0తో మకావు జట్టును ఓడించింది. ఈ గెలుపుతో భారత్ తమ డీ గ్రూప్ నుంచి క్వార్టర్ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది.
తొలుత మిక్స్డ్ డబుల్స్లో సతీశ్ కుమార్- ఆద్య వరియత్ జోడీ 21-10, 21-9తో చాంగ్ లియోంగ్-వెంగ్ జీ జంటపై విజయం సాధించి పాయింట్స్ ఖాతా తెరిచింది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ 21-16, 21-12తో ప్యాంగ్ ఫాంగ్పై గెలిచి భారత్ ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేశాడు.

మహిళల సింగిల్స్లో మాళవిక 21-15, 21-9తో హావో వాయిపై విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని మూడింతలు చేసింది. అనంతరం పురుషుల డబుల్స్లో ఎం ఆర్ అర్జున్-చిరాగ్ శెట్టి 21-15, 21-19తో చాంగ్ ప్యూ-వెంగ్ వాంగ్పై, చివరిగా మహిళల డబుల్స్లో గాయత్రి-ట్రీసా ద్వయం 21-10, 21-5తో ఎన్ వెంగ్ జీ- వా ప్యూపై గెలుపుతో భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ గెలుపుతో భారత్ తిరుగులేని ఆధిక్యంతో క్వార్టర్స్కు అర్హత సాధించింది. ఇక గ్రూప్లో తనకు చివరిదైన రెండో మ్యాచ్ను భారత్ గురువారం కొరియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిచే జట్టే ఈ గ్రూప్ టాపర్గా నిలుస్తోంది. కొరియా ఇప్పటికే మకావును ఓడించింది.