సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ 2023 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తీవ్రంగా నిరాశపరిచాడు. చైనా షట్లర్ వాంగ్ హాంగ్ యాంగ్ చేతిలో పోరాడి ఓడాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 9-21, 23-21, 20-22 తేడాతో వాంగ్ హాంగ్ చేతిలో ఓటమిపాలయ్యాడు.
దీంతో వరుసగా రెండో బీడబ్ల్యూఎఫ్ టైటిల్ను నెగ్గే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ ఫైనల్ పోరులో ప్రణయ్ ఆఖరి క్షణం వరకు పోరాడాడు. తొలి సెట్లో చైనా షట్లర్ ఆధిపత్యం చెలాయించడంతో ప్రణయ్ కనీస పోటీ ఇవ్వలేక 9-21 తేడాతో ఓటమిపాలయ్యాడు.

రెండో సెట్లో మాత్రం అసాధారణంగా పుంజుకున్న ప్రణయ్.. చైనా షట్లర్కు తన సత్తా చూపించాడు. హోరాహోరీగా సాగిన ఈ గేమ్లో చివరకు 23-21 తేడాతో ప్రణయ్ విజయం సాధించాడు. దాంతో నిర్ణయాత్మక సెట్ ఆడాల్సి రాగా.. ప్రణయ్ అదే జోరు కొనసాగించాడు. ఓ దశలో 19-17తో ఆధిక్యంలో నిలిచిన ప్రణయ్ విజయం సాధించేలా కనిపించాడు.
కానీ వాంగ్ అద్వితీయంగా పుంజుకొని స్కోర్లను 20-20 సమం చేశాడు. ఇక్కడి నుంచి నువ్వా-నేనా అన్నట్లు ఇద్దరూ షట్లర్లు పోటీపడ్డారు. వరుసగా రెండు పాయింట్లను ఖాతాలో వేసుకున్న చైనా షట్లర్ 22-20తో గేమ్తో పాటు టైటిల్ను దక్కించుకున్నాడు.
ఈ ఏడాది మేలో కౌలాలంపూర్ జరిగిన మాలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో వాంగ్ హాంగ్ యంగ్ను ఓడించే ప్రణయ్ విజేతగా నిలిచాడు. కానీ ఈ సారి ఆ ఫలితాన్ని రిపీట్ చేయలేకపోయాడు.
స్టార్ షట్లర్ పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్లు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. సింధు 12-21, 17- 21 తేడాతో అమెరికన్ షట్లర్ బెయివెన్ చేతిలో ఓడగా.. శ్రీకాంత్ 13-21, 8-21 తేడాతో భారత్కు చెందిన ప్రియాన్షు చేతిలో ఖంగుతిన్నాడు. పీవీ సింధు వైఫల్యం భారత బ్యాడ్మింటన్ వర్గాలు ఆందోళనకు గురి చేస్తోంది.
జాగ్ చేతిలో సింధుకు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. ఒలింపిక్స్కు ఇంకా ఏడాది సమయమే ఉండటం.. సింధు వరుసగా విఫలమవ్వడం ఆందోళన పరుస్తోంది.