పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రిపరేషన్స్ కోసం ప్రభుత్వం నుంచి వ్యక్తిగతంగా తనకు ఎలాంటి సహాయం అందలేదని భారత డబుల్స్ స్టార్ షట్లర్ అశ్విన్ పొన్నప్ప తెలిపింది. కనీసం తాము కోరుకున్న కోచ్ను కూడా నియమించలేదని ఆరోపించింది. ఇక ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులకు అందించిన ఆర్థిక సహాయం వివరాల్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మంగళవారం విడుదల చేసింది.
ఈ వివరాల్లో అశ్వినికి టాప్ పథకం కింద రూ. 4 లక్షల 50 వేలు, వార్షిక శిక్షణ శిబిరాలు, టోర్నీల కోసం రూ. 1 కోటీ 48 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంది. కానీ ఈ లెక్కల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అశ్విన్ ఆరోపించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ ప్రకటనను విడుదల చేసింది.

'సాయ్ లెక్కలు చూసి నేను పూర్తిగా షాక్కు గురయ్యా. నాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు. కానీ ఇవ్వని డబ్బును నాకు ఇచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదం. నేనేమీ తీసుకోలేదు. జాతీయ శిబిరం విషయానికొస్తే.. పాల్గొన్న క్రీడాకారులందరికి కలిపి రూ. 1.5 కోట్లు ఖర్చు చేశారు. మాకు ప్రత్యేకమైన కోచ్ కూడా లేడు.
వ్యక్తిగత కోచ్ను నా సొంత డబ్బులతో నేనే నియమించుకున్నా. ఎవరి నుంచి డబ్బులు తీసుకోవట్లేదు. 2023 వరకు నేనే సొంతంగా ఆడాను. ఒలింపిక్స్ అర్హత సాధించిన తర్వాతే నన్ను టాప్ పథకంలోకి చేర్చారు. క్రీడా మంత్రిత్వశాఖ నాకు ఎప్పుడూ మద్దుతగా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా జట్టులో ఉన్నా.. నాకిచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు.
గతేడాది నాకు ఎలాంటి మద్దతు లభించలేదు. అయినా నేను బాధపడలేదు. కానీ రూ. 1.5 కోట్లు నాకిచ్చినట్లు చెప్పడం సరికాదు. నాలుగేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేశామంటే సరే. సిక్కిరెడ్డితో భాగస్వామిగా ఉన్నప్పుడు టాప్ పథకంలో ఉన్నా'అని అశ్విని వివరించింది. మరోవైపు అశ్విని ప్రయాణాలు, వసతి, ఆహారం, టోర్నీల ఫీజు, డీఏలకు రూ. 1.48 కోట్లు ఖర్చు చేసినట్లు సాయ్ వర్గాలు పేర్కొన్నాయి.
గత మూడేళ్లుగా పారిస్ ఒలింపిక్స్ ప్రిపరేషన్స్ కోసం భారత ప్రభుత్వం రూ. 470 కోట్లను ఖర్చు పెట్టింది. ఇందులో ఎక్కువ భాగం అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం రూ. 96.08 కోట్లు ఖర్చు చేయగా.. బ్యాడ్మింటన్కు రూ. 72.02 కోట్లు, బాక్సింగ్కు రూ. 60.93 కోట్లు, షూటింగ్కు రూ. 60.42 కోట్లు వెచ్చించింది.
బ్యాడ్మింటన్లో ఒక్క పతకం రాకపోగా.. అథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా ఒక్కడే రజత పతకం సాధించాడు. ఊహించినట్లుగానే షూటింగ్లో మూడు పతకాలు వచ్చాయి. హాకీ ఇండియా మరోసారి కాంస్యంతో సత్తా చాటగా.. రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ ఒక కాంస్య పతకం సాధించాడు. పతకాలు పక్కా వస్తాయని ఆశించిన బ్యాడ్మింటన్, ఆర్చరి, బాక్సింగ్ ఈవెంట్లలో నిరాశే ఎదురైంది.