పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షట్లర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఒక్క పతకమూ సాధించకుండా వెనుదిరిగారు. కనీసం కాంస్య పతకం గెలుస్తాడని భావించిన లక్ష్యసేన్ కీలక పోరులో ఓటమిపాలయ్యాడు.
కాంస్య పోరులో లక్ష్యసేన్ ప్రదర్శనపై అతని కోచ్, బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు మరింత బాధ్యతగా ఆడాలని సూచించాడు. 'కేవలం ఒక్క ఆటగాడి విజయంతో సంతృప్తి చెందలేం. అందరిపైనా ఫోకస్ పెట్టాల్సిందే.

మీకు ఏం కావాలో అడుగుతున్నప్పుడు.. దానికి తగిన జవాబుదారీతనం కూడా ఉండాలి. ఆటగాళ్లు మరింత బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోవాలి'అని మీడియాతో అన్నాడు.
ఈ వ్యాఖ్యలపై స్టార్ షట్లర్ అశ్విన్ పొన్నప్ప తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అథ్లెట్ల విజయాల్లో భాగమయ్యే కోచ్లు.. ఓటముల విషయంలో కూడా బాధ్యత తీసుకోవాలని ఘాటుగా బదులిచ్చింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించింది.
'ప్రకాశ్ పదుకొనే చేసిన వ్యాఖ్యలు బాధించాయి. ఒక ఆటగాడు గెలిస్తే ఆ క్రెడిట్ తీసుకోవడానికి అందరూ ముందుంటారు. ఓడితే మాత్రం ఆటగాళ్లదే తప్పిదమని పక్కకు తప్పుకుంటారు. కోచ్లు ఎందుకు బాధ్యత తీసుకోరు? సరైన సన్నద్దత లేకపోవడం, సరైన వ్యూహాలు రచించకపోవడం వల్లే ఓడారని ఎందుకు భావించరు? గెలుపులో సమష్టి కృషి ఎంత కీలకమో.. ఓటమిలో కూడా అంతే బాధ్యత ముఖ్యం. కేవలం ఆటగాళ్లపై నిందలేయడం సరికాదు.'అని అశ్విని పొన్నప్ప రాసుకొచ్చింది.
సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ కాంస్య పోరులో లక్ష్యసేన్ 21-13, 16-21, 11-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. సునాయసంగా గెలిచే ఈ మ్యాచ్ను లక్ష్యసేన్ చేజేతులా చేజార్చుకున్నాడు.