India vs South Africa: కెప్టెన్‌గా కోహ్లీకి 50వ మ్యాచ్‌, టీమిండియా బ్యాటింగ్

హైదరాబాద్: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పు చేసింది. ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి స్థానంలో పేసర్ ఉమేశ్ యాదవ్‌కి తుది జట్టులో చోటు కల్పించింది.

కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికి ఇది 50వ టెస్టు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. అత్యధిక మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవీ గంగూలీ (49) రికార్డుని కోహ్లీ అధిగమించాడు. 60 టెస్టులతో ఈ జాబితోలా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు.

భారత జట్టు సొంతగడ్డపై 2013 నుంచి 30 టెస్టులు ఆడితే 24 గెలిచి ఒకే ఒక్క టెస్టులో ఓడిపోయింది. ఆ ఒక్క ఓటమి ప్రస్తుతం సఫారీలతో రెండో టెస్టు జరుగుతున్న పూణె స్టేడియంలోనే కావడం విశేషం. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా ఏకంగా 333 పరుగులతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగడంతో పాటు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఒ కీఫ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు.

ఇప్పుడు రెండున్నరేళ్ల విరామం తర్వాత అదే పూణె రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటికే తొలి టెస్టులో గెలిచి ఉత్సాహంలో ఉన్న టీమిండియా... పూణె టెస్టులో కూడా విజయం సాధించి టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు సఫారీ జట్టు రెండో టెస్టులో విజయం సాధించి సిరిస్‌ను సమం చేయాలని భావిస్తోంది.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే, పిచ్‌పై కాస్త పచ్చికతో కనిపిస్తోంది. ఆరంభంలో కొంత సమయం మాత్రం పేసర్లకు సహకరిస్తుందని అంచనా. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలం. రెండో టెస్టుకు వర్ష సూచన ఉంది. పూణెలో గత కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం కూడా వర్షం పడింది.

జట్ల వివరాలు

భారత్‌: రోహిత్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, కోహ్లీ, రహానే, ఉమేశ్ యాదవ్, సాహా, అశ్విన్‌, జడేజా, ఇషాంత్‌, మహ్మద్‌ షమి.

దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌, ఎల్గర్‌, డిబ్రుయిన్‌, బవుమా, డుప్లెసిస్‌, డికాక్‌, ముత్తుసామి, ఫిలాండర్‌, కేశవ్‌ మహారాజ్‌, రబాడ, ఎంగిడి.

READ SOURCE