రాంచీ: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ(199 నాటౌట్; 242 బంతుల్లో 28x4, 4x6), వైస్కెప్టెన్ అజింక్య రహానే (115; 192 బంతుల్లో 17x4, 1x6) సెంచరీలు చేయడంతో భారత్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే రోహిత్ శర్మ డబుల్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉండగా.. అంపర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ సమయానికి భారత్ 357/4తో ఉంది. రోహిత్, జడేజా(15; 27 బంతుల్లో 2x4) క్రీజులో ఉన్నారు.
ఓవర్నైట్ స్కోర్ 224/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన రోహిత్, రహానే బాధ్యతగా ఆడుతూ జట్టు స్కోరును 300 దాటించారు. తొలిరోజు మెరుపులు మెరిపించిన రోహిత్, రహానే జంట మొదటి సెషన్లోనూ దాటిగా ఆడారు. ఈ క్రమంలో రోహిత్ 199 బంతుల్లో 150 పరుగులు చేస్తే.. రహానే 172 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఈ సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు ఎట్టకేలకు నాలుగో వికెట్ తీశారు. లిండే బౌలింగ్లో రహానే.. క్లాసెన్ చేతికి చిక్కాడు.
రోహిత్, రహానేలు 267 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీ అనంతరం రహానే ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(15; 27 బంతుల్లో 2x4) హిట్మ్యాన్కు అండగా నిలిచాడు. దీంతో లంచ్ విరామానికి భారత్ 357/4తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాగిసో రబాడ రెండు వికెట్లు తీశారు.
తొలి రెండు టెస్టుల తరహాలోనే మూడో మ్యాచ్లోనూ తొలి రోజు భారత్ పట్టు నిలబెట్టుకుంది. శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ 58 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (164 బంతుల్లో 117 బ్యాటింగ్; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించగా.. అజింక్య రహానే (135 బంతుల్లో 83; 11 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. వర్షం, వెలుతురు లేమి కారణంగా టీ విరామం తర్వాత కొద్ది సేపటికే అంపైర్లు ఆటను నిలిపివేశారు. దాంతో మరో 32 ఓవర్ల ఆటను కోల్పోవాల్సి వచ్చింది. మయాంక్ అగర్వాల్ (10), పుజారా (0), విరాట్ కోహ్లీ (12) తక్కువ పరుగులకే వెనుదిరిగారు.