ఢిల్లీ: భారత పర్యటనలో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. ఈ ఓటమిపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్, కృనాల్ పాండ్యా, ఖలీల్ అహ్మద్లపై విరుచుకుపడుతున్నారు.
3 కారణాలు ఇవే:
అభిమానులు ఆటగాళ్లపై మండిపడడానికి సరైన కారణమే ఉంది. పంత్ రివ్యూ వృధా చేయగా.. కృనాల్ కీలక క్యాచ్ మిస్ చేసాడు. ఇక ఖలీల్ 19వ ఓవర్లో ఏకంగా నాలుగు బౌండరీలు సమర్పించుకున్నాడు. అలాగే మరో మూడు పొరపాట్లు కూడా భారత్ కొంపముంచాయి. ఇందులో మొదటిది ఎల్బీ అప్పీల్ చేయకపోవడం, రెండవది ఫీల్డింగ్, డెత్ ఓవర్లలలో అనుభవం లేని బౌలింగ్.
ఎల్బీ అప్పీల్ చేయకపోవడం:
బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ 6 పరుగుల వద్ద వున్నపుడు చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ బౌలింగ్లో ఎల్బీకి అప్పీల్ చేయగా.. ఎంపైర్ తిరస్కరించాడు. అయితే రీప్లేలో మాత్రం అది ఔట్గా తేలింది. అప్పటికి టీమిండియాకు రివ్యూ ఉంది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ రివ్యూని సరిగ్గా అంచనావేయలేకపోవడంతో టీమిండియాకు రివ్యూని వినియోగించుకోలేకపోయింది. అనంతరం రహీమ్ (43 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు.
ఫీల్డింగ్ లోపాలు:
క్యాచ్లే మ్యాచ్ను నిలబెడతాయని తెలిసిన విషమే. ఫీల్డింగ్లో కూడా టీమిండియా లోపాలు మ్యాచ్ను చేజార్చేలా చేశాయి. మ్యాచ్ హోరాహోరిగా జరుగుతునప్పుడు లాంగ్ ఆన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కృనాల్ పాండ్య.. 18ఓవర్ లో ముష్ఫికర్ రహీమ్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను నేలపాలు చేశాడు. ఆతరువాతి ఓవర్లోనే వరుసగా నాలుగు బౌండరీలు బాది తన జట్టును విజయానికి చేరువ చేసాడు. పాండ్యా గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.
అనుభవమేలేమి బౌలింగ్:
ఇక డెత్ ఓవర్లలో అనుభవమేలేమి బౌలింగ్ కారణంగా టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. అప్పటివరకు మన చేతుల్లో ఉన్న మ్యాచ్ పసలేమి బౌలింగ్ కారణంగా ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్ళింది. 19ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ చివరి నాలుగు బంతులకు బౌండరీలు ఇచ్చాడు. ఖలీల్ స్థానంలో అనుభవమున్న బుమ్రా, షమీ, భువీ ఉంటే అన్ని పరుగులు వచ్చేవి కావు. చివరి ఓవర్లో మ్యాచ్ ఉత్కంఠంగా ఉండేది.