IND vs SA: ప్రపోజ్ చేసిన అభిమాని.. సిగ్గుపడ్డ రిషబ్ పంత్ (వీడియో)

హైదరాబాద్: ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లలో యువకులే ఎక్కువగా ఉన్నారు. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, రిషబ్ పంత్ ఇలా చాలా మందే ఉన్నారు. అయితే యువ కీపర్ రిషబ్ పంత్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ త్వరలో క్రికెట్ నుండి తప్పుకోనున్న నేపథ్యంలో అతడికి వారసుడుగా భావిస్తున్న పంత్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. దీంతో పంత్‌కి ఫాలొయింగ్ కూడా బాగేనా పెరిగింది.

లవ్ యూ రిషబ్

తాజాగా బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ-20లో రిషబ్‌ పంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసింది. ఈ మ్యాచ్ అనంతరం మైదానంలో ఉన్న పంత్.. స్టాండ్స్‌లో ఉన్న అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు. చాలా మంది పంత్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. కానీ.. ఓ లేడీ అభిమాని మాత్రం ఆటోగ్రాఫ్ అడగకుండా ఏకంగా పంత్‌కు ప్రపోజ్ చేసింది. 'లవ్ యూ రిషబ్' అంటూ ఆ అమ్మాయి గట్టిగా అరిచింది. అది విన్న పంత్ సిగ్గుపడుతూ నవ్వాడు. అనంతరం ఆటోగ్రాఫ్ ఇస్తూ వెళ్ళిపోయాడు.

పంత్‌కి నేను ప్రేమిస్తున్నా

ఇందుకు సంబంధించిన వీడియోని ఆ అమ్మాయే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'కనీసం రిషబ్‌ పంత్‌కి నేను ప్రేమిస్తున్నానని తెలుసు. దేవుడా.. చివరకు అతను ఎలా సిగ్గు పడ్డాడో చూడండి' అని సాల్వి అనే అమ్మాయి ట్వీట్ చేసింది. పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు. కొందరు సాల్వికి 'ఆల్ ది బెస్ట్' చెపుతున్నారు.

సింగిల్ డిజిట్ స్కోర్‌లు

ధోనీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న పంత్‌కు ఇటీవలి కాలంలో పదే పదే జట్టులో స్థానం ఇస్తున్నారు. అయినా పంత్ పరుగులు చేయలేకపోతున్నాడు. వెస్టిండీస్‌ సిరీస్‌లో తనకు అలవాటైన చెత్త షాట్లకు ఔటైన సంగతి తెలిసిందే. పంత్ తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 77 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఐదు సింగిల్ డిజిట్ స్కోర్‌లు ఉన్నాయి. ఇక ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా 4, 19 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.

పంత్‌ ఆటతీరుపై ఆగ్రహం

పంత్ ఆటతీరుపై ఇప్పటికే కోచ్‌ రవిశాస్త్రి పంత్‌ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇక కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కూడా హెచ్చరించాడు. వీరితో పాటు పలువురు మాజీలు పంత్‌ ఆట తీరును మార్చుకోమని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ మాత్రం ఘాటుగా స్పందించాడు. పంత్‌కు ఇచ్చిన అవకాశాలు ఇక చాలు, సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలన్నాడు. అయితే పంత్‌కు యువరాజ్‌ మద్దతుగా నిలిచాడు. 'ధోనీ కూడా ఒక రోజులో అవకాశాలు అందిపుచ్చుకోలేదు. అతనికి కొన్ని సంవత్సరాలు పట్టింది. పంత్‌పై విమర్శలు ఆపండి' అని అన్నాడు.

READ SOURCE