లంచ్ బ్రేక్: ఎల్గర్‌ హాఫ్ సెంచరీ.. దక్షిణాఫ్రికా స్కోర్ 153/4

విశాఖపట్నం: సాగ‌ర‌తీరం విశాఖ వేదిక‌గా టీమిండియాతో జ‌ర‌గుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ద‌క్షిణాఫ్రికా కుదురుకుంది. మొద‌టి రెండు రోజులు భార‌త బ్యాట్స్‌మెన్స్ స‌ఫారీ బౌల‌ర్లకి చుక్కలు చూపించగా.. మూడో రోజు ఓపెనర్ డీన్ ఎల్గ‌ర్ 76 ( 8 ఫోర్స్, 3 సిక్స్‌), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 48( 7ఫోర్స్‌, 1 సిక్స్‌) భార‌త్ బౌల‌ర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్నారు. ఇద్ద‌రు ఆచితూచి ఆడుతూ మ‌రో వికెట్ పడ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా లంచ్ స‌మయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 153 ప‌రుగులు చేసింది.

దక్షిణాఫ్రికా 39/3తో మూడో రోజు ఆటను ప్రారంబించింది. ఉదయం పేసర్ ఇషాంత్‌ శర్మ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కట్టుదిట్టమైన బంతులు వేశారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచారు. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఎల్గర్‌, బవుమా నిలకడగా ఆడారు. అయితే 27వ ఓవర్‌ వేసిన ఇషాంత్‌ తొలి బంతికే బవుమాను పెవిలియన్‌ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ డుప్లెసిస్‌ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్స్ కొట్టి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. మరోవైపు ఎల్గర్‌ మాత్రం వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేసాడు.

ఇక 40వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ ఎల్గర్‌.. బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. డుప్లెసిస్‌ అతనికి చక్కటి అందిస్తున్నాడు. ఈ ఇద్దరు ఇప్పటికే 144 బంతుల్లో 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 50 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్‌, ఎల్గర్‌ ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇంకా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కు 349 పరుగులు వెనకబడి ఉంది. రెండో రోజు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్‌ (5), డి బ్రూన్‌ (4) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. డేన్‌ పీడ్‌ (0) డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీయగా.. ఇషాంత్, జడేజాకు తలో వికెట్ లభించింది.

రెండో రోజు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 136 ఓవర్లకు గాను 502/7 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. టీమిండియా డిక్లేర్ చేసే సమయానికి రవీంద్ర జడేజా (30), రవిచంద్రన్‌ అశ్విన్‌ (1) అజేయంగా నిలిచారు. రోహిత్‌ శర్మ (176, 244 బంతుల్లో; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ, మయాంక్ అగర్వాల్ (371 బంతుల్లో 215, 22 ఫోర్లు, 5 సిక్సులు) డబుల్ సెంచరీ చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ మూడు వికెట్లు తీయగా.. ఫిలాండర్, డేన్‌ పీడ్త్‌, ముత్తుస్వామి, డీన్‌ ఎల్గర్‌లు తలో వికెట్‌ తీశారు.

READ SOURCE