హైదరాబాద్: సెప్టెంబర్లో కెనడాతో జరగనున్న టై పోరుకు భారత డేవిస్ కప్ జట్టులో వెటరన్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్కు చోటు దక్కలేదు. అయితే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న యుకి బాంబ్రి, తెలుగు ప్లేయర్ సాకేత్ మైనేని మాత్రం తిరిగి జట్టులోకొచ్చారు.
వీరిద్దరితో పాటు రామ్కుమార్ రామనాథన్, రోహన్ బోపన్న డేవిస్ కప్ జట్టుకు ఎంపికయ్యారు. మరోవైపు ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్, శ్రీరామ్ బాలాజీని రిజర్వు ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. 44 ఏళ్ల లియాండర్ పేస్ని ఈ ఏడాది ఏప్రిల్లో ఉజ్బెకిస్థాన్తో బెంగళూరులో జరిగిన పోరుకు పేస్ను ఎంపిక చేశారు.
అయితే కెప్టెన్ మహేష్ భూపతి ఫైనల్లో ఆడే నలుగురి సభ్యుల నుంచి పేస్ను తప్పించాడు. దీంతో అవమానంగా భావించిన లియాండర్ పేస్ మధ్యలోనే అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. డేవిస్ కప్లో 42 డబుల్స్ విజయాలు సాధించిన పేస్ ఇటలీ ఆటగాడు నికోల పీట్రాంజలితో సమంగా ఉన్నాడు.
ఒక్క విజయం సాధిస్తే లియాండర్ పేస్ వరల్డ్ రికార్డు సాధిస్తాడు. మరోవైపు యుకీ బాంబ్రీ ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు. ఇక సాకేత్ మైనేని గాయం కారణంగా బెంగళూరు వేదికగా ఉజ్బెకిస్థాన్తో జరిగిన మ్యాచ్కి దూరమయ్యాడు.