హైదరాబాద్: వింబుల్డన్లో బుధవారం సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే క్వార్టర్ ఫైనల్లో సామ్ క్వెరీ చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోవైపు గాయం కారణంగా రెండో సీడ్ జొకోవిచ్ కూడా క్వార్టర్స్ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు.
దీంతో వింబుల్డన్లో ఫేవరెట్ కథ ముగిసింది. ప్రస్తుతం టోర్నీలో తిరుగులేని ఫామ్లో ఉన్న మూడో సీడ్ ఫెదరర్ అలవోకగా సెమీస్కు దూసుకెళ్లాడు. దీంతో టాప్-4లో ఫేవరేట్గా ఫెదరర్ మాత్రమే మిగిలాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) 6-4, 6-2, 7-6 (7/4)తో ఆరో సీడ్ రావ్నిచ్ (కెనడా)ను చిత్తుగా ఓడించాడు.

ఒక్క మూడో సెట్లోనే ఫెదరర్కు గట్టి పోటీ ఎదురైంది. మ్యాచ్లో అతడు 11 ఏస్లు, 46 విన్నర్లు కొట్టాడు. తాజా విజయంతో గతేడాది ఇదే వింబుల్డన్ టోర్నీ సెమీస్లో రావ్నిచ్ చేతిలో ఎదురైన ఓటమికి ఫెదరర్ బదులు తీర్చుకున్నట్లు అయింది. ఫెదరర్ తన కెరీర్లో 42వ సారి గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు చేరడం విశేషం.
ఈ టోర్నీలో ఫెవరేట్గా బరిలోకి దిగిన సెర్బియా స్టార్ జొకోవిచ్ అనూహ్యంగా క్వార్టర్స్లోనే వెనుదిరిగాడు. ప్రత్యర్థి 11వ సీడ్ బెర్డిచ్ (చెక్) 7-6 (7-2), 2-0తో ఆధిక్యంలో ఉన్న దశలో జకోవిచ్ గాయం కారణంగా నిష్క్రమించాడు. మరోవైపు ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) సెమీస్లో అడుగుపెట్టాడు.
ఇక మహిళల సింగిల్స్లో అన్సీడెడ్ రిబరికోవా (స్లొవేకియా) సెమీఫైనల్లో ప్రవేశించింది. క్వార్టర్ఫైనల్లో ఆమె 6-3, 6-3తో బ్రిటన్ అమ్మాయి 24వ సీడ్ వాండెవెపై అలవోకగా విజయం సాధించింది. ప్రపంచ నంబర్-87 రిబరికోవా.. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో సెమీస్ చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

2008 నుంచి వింబుల్డన్లో ఆడుతున్న 28 ఏళ్ల రిబరికోవా.. ఈ టోర్నీకి ముందు ఎనిమిదిసార్లు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన రోహన్ బోపన్న క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్), గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) జంట 7-6 (7/5), 6-2తో మెక్టిక్, అనా కొంజూ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించింది.
మరో మ్యాచ్లో సానియా మీర్జా (భారత్), డోడిచ్ (క్రొయేషియా) జోడీ 6-7 (4-7), 4-6తో కొంటినెన్ (ఫిన్లాండ్), హెదర్ వాట్సన్ (బ్రిటన్) జంట చేతిలో ఓటమి పాలైంది.