హైదరాబాద్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో పురుషుల డబుల్స్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. ఇప్పటికే లియాండర్ పేస్ ఈ టోర్నీలో ఓటమిపాలై ఇంటిదారి పట్టగా, తాజాగా రోహన్ బోపన్నకూ ఎదురుదెబ్బ తగిలింది.
హోరాహోరీగా సాగిన రెండో రౌండ్ మ్యాచ్లో ఎనిమిదో సీడ్ రోహన్ బోపన్న-రోజర్ వాజెలిన్ (ఫ్రాన్స్) జోడీ 6-7 (6-8), 3-6, 7-6 (7-5), 3-6 నీల్-కెన్ (బ్రిటన్) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. మరో మ్యాచ్లో దివిజ్ శరణ్-పురవ్ రాజాల జోడీ కూడా ఓటమి పాలైంది.

3 గంటల 31 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 3-6, 4-6, 6-4, 7-6 (8/6), 8-10తో ఏడో సీడ్ రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)-రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఈ జోడీ ఓటమి పాలైంది. ఇక లియాండర్ పేస్ మిక్స్డ్ డబుల్స్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
లియాండర్ పేస్ (భారత్)-యిఫాన్ జు (చైనా) జోడీ 7-5, 3-6, 2-6తో ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)-రలూకా ఒలారూ (రొమేనియా) జంట చేతిలో ఓటమి పాలైంది.