హైదరాబాద్: వింబుల్డన్ ప్రైజ్మనీ భారీగా పెరిగింది. 2018 టోర్నీకి మొత్తం ప్రైజ్మనీ సుమారు రూ. 309 కోట్లు (34 మిలియన్ పౌండ్లు)గా ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. గత ఏడాది రూ. 287 కోట్లు (31.6 మిలియన్ పౌండ్లు)తో పోలిస్తే ఇది 7.6 శాతం ఎక్కువ.
దీంతో ఈ ఏడాది పురు షుల, మహిళల సింగిల్స్ విజేతలు సుమారు రూ. 20.5 కోట్ల చొప్పున ప్రైజ్మనీని అందుకోనున్నారు. గత ఏడాది కంటే దాదాపుగా రూ. 50 లక్షలు అదనం. 2017లో ఫెదరర్, గార్బినె ముగురుజా గెలుచుకున్న ప్రైజ్మనీ కంటే ఇది రూ. 45 లక్షలు ఎక్కువ.
మొదటి రౌండ్లోనే ఓడిన ప్లేయర్లకు రూ. 35 లక్షలు దక్కనున్నాయి. అయితే గాయంతో మధ్యలో వైదొలిగినా లేదా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేపోయినా వారికి లభించాల్సిన మొత్తాన్ని నిలిపేస్తామని నిర్వాహకులు హెచ్చరించారు. దానిని అరికట్టడం కోసం నిర్వాహకులు కొత్త నిబంధన కూడా తీసుకొచ్చారు.
గాయాల కారణంగా తొలిరౌండ్ మధ్యలోనే వైదొలుగుతున్న నేపథ్యంలో 50-50 రూల్ను సరికొత్తగా ప్రవేశపెట్టారు. గాయపడిన ఏ ఆటగాడైనా మెయిన్ డ్రా ఆరంభానికి ముందే వైదొలిగితే తొలిరౌండ్ ప్రైజ్మనీ ద్వారా లభించే మొత్తంలో 50 శాతం అతడికి ఇవ్వనున్నారు.
మిగతా 50శాతం మొత్తాన్ని అతడి స్థానంలో బరిలోకి దిగే ప్లేయర్కు దక్కుతుందని వింబుల్డన్ టోర్నీ నిర్వాహకులు తెలిపారు. ఇక, ఈ ఏడాది కాలుష్య నివారణకు ప్లాస్టిక్ స్ట్రాలను కూడా నిషేధిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.