హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ మహిళల సింగిల్స్లో టాప్సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) కథ ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో హలెప్ 6-3, 4-6, 5-7 తేడాతో సీ సు-వీ(తైవాన్) చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్ను 6-3తో దక్కించుకున్న టాప్సీడ్ హలెప్..వరుసగా రెండు సెట్లను ప్రత్యర్థికి చేజార్చుకుని మూల్యం చెల్లించుకుంది. ఆఖరి సెట్లో ఒకింత పోరాటపటిమ కనబరిచినా.. ఓటమి ఎదురుకాక తప్పలేదు.
హలెప్ ఓటమితో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్కు టైటిల్ కొట్టే అవకాశం మెరుగైంది. టాప్-10 సీడెడ్ క్రీడాకారిణుల్లో ఏడో సీడ్ ప్లిస్కోవా మినహా అందరూ ప్రిక్వార్టర్స్ కంటే ముందే నిష్క్రమించడం గమనార్హం. పదకొండో సీడ్ కెర్బర్ (జర్మనీ) ప్రిక్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్లో కెర్బర్ 6-2, 6-4తో ఒసాక (జపాన్)పై గెలిచింది. ఒస్తాపెంకో (లాత్వియా), సిబుల్కోవా (స్లోవేకియా), కసత్కినా (రష్యా), బెన్సిచ్ (స్విట్జర్లాండ్) కూడా ముందంజ వేశారు.
మరోవైపు పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ నాదల్ జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్లో 6-1, 6-2, 6-4 తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)ను చిత్తుచేసిన నాదల్ ప్రి క్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్లో భారత్, న్యూజిలాండ్ ద్వయం 6-7, 4-6, 6-3, 7-5, 6-4తో చిలీ, అర్జెంటీనా జోడీ పెరల్టా, జెబాలోస్పై విజయం సాధించి ప్రీక్వార్టర్స్లోకి ప్రవేశించింది.
ఐదో సీడ్ డెల్పోట్రో (అర్జెంటీనా) కూడా ముందంజ వేశాడు. మూడో రౌండ్లో డెల్పోట్రో 6-4, 7-6 (7-4), 6-3తో బెనోయిట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. రోనిచ్ (కెనడా) 7-6 (7-5), 4-6, 7-5, 6-2తో డెన్నిస్ నొవాక్ (ఆస్ట్రియా)పై గెలిచి ప్రి క్వార్టర్స్ చేరాడు.