వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో బ్రిటన్ ఆటగాడు జాకబ్ ఫెర్న్లీపై జకోవిచ్ ఘన విజయం సాధించాడు. రెండో సీడ్ జకోవిచ్ ప్రత్యర్థిపై 6-3, 6-4, 5-7, 7-5తో నెగ్గాడు.
మరో రెండో రౌండ్ మ్యాచ్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, ఇటలీ ప్లేయర్ జానిక్ సిన్నర్ గెలిచాడు. తన దేశ క్రీడాకారుడు బెరెటినిపై 7-6 (7-3), 7-6 (7-4), 2-6, 7-6 (7-4)తో విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరు 3 గంటల 42 నిమిషాల పాటు సాగింది. అలాగే గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా మూడో రౌండ్కు చేరుకున్నాడు. చైనా ప్లేయర్ చెంగ్ను 5-7, 6-7 (7), 6-4, 6-2, 6-4తో చిత్తుచేశాడు.

మరోవైపు ఏడో సీడ్ హుర్కాజ్ (పోలెండ్) వాకోవర్ ఇచ్చాడు. ఫిల్స్ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్లో 6-7 (2-7), 4-6, 6-2, 6-6 (8-9)తో వెనుకబడిన దశలో గాయం కారణంగా తప్పుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్లో మరోవైపు టైటిల్ ఫేవరెట్ స్వైటెక్ (పోలెండ్) మూడో రౌండ్కు సునాయాసంగా చేరింది. మార్టిచ్ (క్రొయేషియా)పై 6-4, 6-3తో గెలిచింది.
జపాన్ స్టార్ నవోమి ఒసాకా రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. 19వ సీడ్ ఎమ్మా నవారోతో జరిగిన మ్యాచ్లో 4-6, 1-6 తేడాతో ఘోరపరాభవాన్ని ఎదుర్కొంది. మహిళల సింగిల్స్లో వాంగ్ (చైనా), జాబెర్ (ట్యునీసియా), రిబకినా (కజకిస్థాన్), బౌజాస్ (స్పెయిన్), డార్ట్ (బ్రిటన్) కూడా రెండో రౌండ్ దాటారు. పురుషుల డబుల్స్లో శ్రీరామ్ బాలాజీ-జాన్సన్ (బ్రిటన్) జోడీ 4-6, 5-7తో నాలుగో సీడ్ మార్సెలో (సాల్వడార్), పవిక్ (క్రొయేషియా) ద్వయం చేతిలో మొదటి రౌండ్లో ఓటమి చవిచూసింది.