భారత టెన్నిస్ వెటరన్ రోహన్ బొపన్నకు వింబుల్డన్లో నిరాశే మిగిలింది. గ్రాబ్రియెలా డబ్రోస్కీతో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పోటీ పడిన అతనికి ఓటమి ఎదురైంది. 2019 వింబుల్డన్ ఛాంపియన్స్ ఇవాన్ డోడిగ్, లతీషా చాన్ చేతిలో బోపన్న జోడీ ఓటమిపాలైంది. అలాగే ఇండియన్ డబుల్స్ జోడీ యుకీ భంబ్రీ, సాకేత్ మైనేనీ కూడా వింబుల్డన్ నుంచి నిష్క్రమించారు.
స్పెయిన్కు చెందిన అలెజాండ్రో డవిడోవిచ్, ఫ్రాన్స్కు చెందిన ఆడ్రియన్ మన్నారినో జోడీతో యుకీ, సాకేత్ తలపడ్డారు. వింబుల్డన్ మొదటి రౌండ్లోనే యుకీ, సాకేతో జోడీ నిష్క్రమించడం గమనార్హం. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో మొదటి సెట్ ఓడిపోయిన సాకేత్ జోడీ.. రెండో సెట్లో పుంజుకొని విజయం సాధించింది. కానీ నిర్ణయాత్మక మూడో సెట్లో అలెజాండ్రో జోడీ చేతిలో ఓడిపోయింది.

రెండు గంటలపాటు సాగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్లో యుకీ, సాకేత్ జోడీ 4-6, 6-4, 4-6 తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో వింబుల్డన్ మొదటి రౌండ్లోనే ఈ జోడీ ఇంటిదారి పట్టింది. ఇక మిక్స్డ్ డబుల్స్లో రోహన్ బోపన్న, గాబ్రియెలా డబ్రోస్కీ జోడీకి కూడా ఇలాంటి ఫలితమే ఎదరైంది. ఆరో సీడ్గా ఉన్న ఈ జోడీ తొలి సెట్లో గెలిచింది. కానీ ఆ తర్వాతి రెండు సెట్స్లో ఓడిపోయింది.

ఈ మ్యాచ్లో తొలి సెట్లో బోపన్న జోడీ దూకుడు కనబరిచింది. 7-6 (5) తేడాతో ఈ సెట్ను తన ఖాతాలో వేసుకుంది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న ఇవాన్, లతీషా ద్వయం చెలరేగింది. వరుస సెట్లను 3-6, 4-6తో తమ ఖాతాలో వేసుకొని బోపన్న జోడీపై విజయం సాధించింది. 43 ఏళ్ల బోపన్నకు తన కెరీర్లో ఇదే చివరి సీజన్ కావడం గమనార్హం. అయితే పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న, ఆసీస్ ప్లేయర్ మాథ్యూ ఎబ్డెన్ జోడీ తొలి రౌండ్లో గెలిచింది. దీంతో ఈ టోర్నీలో బోపన్న ఇంకా కొనసాగనున్నాడు.