వింబుల్డన్లో భారత స్టార్ రోహన్ బోపన్న జోడీ పోరాడి ఓడింది. బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. సెమీ ఫైనల్స్లో వెస్టీ కులోఫ్, నీల్ కుప్స్కీ ద్వయాన్ని ఎదుర్కొన్న బోపన్న జోడీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ మ్యాచ్లో 5-7, 4-6 తేడాతో వరుస సెట్లలో బోపన్న జోడీ ఓడింది. దీంతో వింబుల్డన్ నుంచి నిష్క్రమించి ఇంటి దారి పట్టింది.
ఇక కొన్ని రోజుల క్రితం ప్రపంచ నెంబర్ వన్ ఇగా స్వియటెక్కు షాకిచ్చిన స్విటొలినా కూడా వింబుల్డన్ నుంచి తప్పుకుంది. మార్కెటా వొండ్రుసోవాతో జరిగిన మ్యాచ్లో స్విటొలినా ఓటమిపాలైంది. మరో సెమీఫైనల్లో రెండో సీడ్ అరియానా సబలెంకను ఆరో సీడ్ ఆన్స్ జెబ్యూర్ ఓడించింది. దీంతో వరుసగా రెండోసారి వింబుల్డన్ ఫైనల్కు దూసుకెళ్లిందామె. ఈ రెండు మ్యాచుల్లో నెగ్గిన జెబ్యూర్, వొండ్రుసోవా.. ఇద్దరూ శనివారం జరిగే టైటిల్ పోరులో తలపడనున్నారు.

ఇక గురువారం జరిగిన సెమీస్ మ్యాచ్లు చాలా థ్రిల్లింగ్గా జరిగాయి. గతేడాది రన్నరప్గా నిలిచిన ట్యునీషియన్ ప్లేయర్ జెబ్యూర్ చాలా పట్టుదలగా ఆడింది. బెలారస్కు చెందిన సబలెంక చేతిలో తొలి సెట్ కోల్పోయిన ఆమె.. ఆ తర్వాతి రెండు సెట్స్లో చెలరేగింది. దీంతో 6-7(5), 6-4, 6-3తో సబలెంకను చిత్తుచేసింది. అరియానా 10 ఏస్లు, 39 విన్నర్లతో ఆధిపత్యం ప్రదర్శించినా.. 45 అనవసర తప్పిదాలు చేయడంతో దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఇక మరో సెమీస్లో అన్సీడెడ్ ప్లేయర్లు వొండ్రుసోవా, స్విటొలినా అమీతుమీ తేల్చుకున్నారు. ఈ పోరులో వొండ్రుసోవా అనూహ్య ఆటతో అదరగొట్టింది. క్వార్టర్స్లో టాప్ సీడ్ స్వియటెక్ను ఓడించిన స్విటోలినాకు గట్టి షాకిచ్చింది. ఆమె ఈ మ్యాచ్లో కనీస పోరాటం కూడా చూపించలేదు. దీంతో చెక్ భామ వొండ్రుసోవా 6-3, 6-3తో స్విటోలినాను వరుస సెట్లలో చిత్తు చేసింది.