ప్రముఖ టెన్నిస్ టోర్నీ వింబుల్డన్ మొదలైంది. ప్లేయర్లు, ఫ్యాన్స్ అందరూ ఉత్సాహంగా మ్యాచులు వీక్షిస్తున్నారు. ఇలాంటి సమయంలో వింబుల్డన్ నిర్వాహకులు ఒక హెచ్చరిక చేశారు. ఈ మ్యాచులు జరిగే క్లబ్లో 12వ నెంబర్ కోర్టుకు సమీపంలో 'క్వైట్ రూం' ఉంటుంది. మ్యాచ్ సమయంలో ఎవరైనా ప్రార్థనలు చేసుకోవాలన్నా, తల్లులు బిడ్డలకు పాలు పట్టాలన్నా ఈ గదిలో అలాంటి పనులు చేసుకునే వీలుంటుంది.
అలాగే ఆటగాళ్లు మెడిటేషన్ చేయాలన్నా ఈ గదిలో చేసుకోవచ్చు. కానీ గతేడాది వింబుల్డన్ సందర్భంగా ఈ గదిలో చాలా మంది రాసలీలలు సాగించినట్లు వార్తలు వచ్చాయి. ఆ గదిలో నుంచి ఒక జంట బయటకు వచ్చిందని, అక్కడ ఏం చేశారో వాళ్లను చూస్తేనే తెలిసిపోయిందని కొందరు ఫ్యాన్స్ కంప్లయింట్ చేశారు. మరికొందరేమో ఆ గది సమీపంలోకి వెళ్లగానే.. అసభ్యకర శబ్దాలు వినిపించాయని వెల్లడించారు.

ఈ క్రమంలో ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్టీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలీ బోల్టన్ హెచ్చరికలు చేశారు. ఇలాంటి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 'క్వైట్ రూం' అనేది చాలా ముఖ్యమైన గది అని.. ప్రార్థనలు, మెడిటేషన్ వంటివి చేసుకునేందుకు ఉపయోగించే ప్రశాంతమైన ప్రదేశం అని ఆమె చెప్పారు.
ఇలాంటి ముఖ్యమైన గదిని అసభ్యకరమైన పనులు చేయడానికి వాడుకోవడం సరికాదన్న ఆమె.. ప్రేక్షకులు, ఆటగాళ్లు ఎవరూ ఈ గదిని ఇలాంటి చెత్త పనులకు వాడొద్దని స్పష్టం చేశారు. ఈ గదిని సరైన పద్ధతిలో వాడుకోవాలని, అలాకాకుండా ఇలాంటి పనులకు వాడుకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. కాగా, సోమవారం మొదలైన వింబుల్డన్ తొలి రౌండ్లో నొవాక్ జకోవిక్, ఇగా స్వియాటెక్కు శుభారంభం లభించిన సంగతి తెలిసిందే.