లండన్: ఆదివారం ముగిసిన వింబుల్డన్ 2021లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం రెండు మ్యాచ్లపై విచారణ జరుగుతోంది. వింబుల్డన్ గ్రాండ్స్లామ్లో ఒక సింగిల్స్ మ్యాచ్, ఓ డబుల్స్ మ్యాచ్పై ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు గుర్తించిన ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) విచారణ జరుపుతోంది. కొన్ని బెట్టింగ్ సంస్థలు కూడా ఈ రెండు మ్యాచ్లపై జరిగిన బెట్టింగ్లపై సందేహాలు వ్యక్తం చేశాయి.
పురుషుల డబుల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఐటీఐఏ అనుమానాస్పద లిస్ట్లో ఉంది. లైవ్ బెట్స్ భారీ ఎత్తున నడుస్తున్న సమయంలో ఈ మ్యాచ్ ఫేవరెట్ జోడీ ఓడిపోయినట్లు పలు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఈ జోడీ తొలి సెట్ గెలిచి.. తర్వాతి రెండు సెట్లను ఓడిపోయింది. ఫేవరెట్ జోడీ అయి ఉండి రెండు సెట్లను దారుణంగా కోల్పోవడం కూడా పలు అనుమానాలు రేకెత్తిస్తుతున్నాయి.
Tokyo Olympics 2021: ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు అమెరికా మొదటి మహిళ!!
జర్మన్ ప్లేయర్ ఆడిన ఫస్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్ కూడా అనుమానాస్పద లిస్ట్లో ఉంది. అయితే ఆ ప్లేయర్ ప్రత్యర్థిపై ఈ మ్యాచ్లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ తర్వాత పరిస్థితిపై ఐదు అంకెల మొత్తం బెట్టింగ్ నడిచినట్లు తేలింది. కచ్చితంగా ఫలితం కూడా అలాగే వచ్చింది. ఈ మ్యాచ్లో సర్వీస్ గేమ్స్ సంఖ్యపై కూడా ప్రత్యేక బెట్స్ నడిచాయి. సర్వీస్ గేమ్స్ విషయంలో కూడా కచ్చితమైన ఫలితం వచ్చిందట. రెండు మ్యాచ్లపై ఐటీఐఏ విచారణ జరుపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య మొత్తం 11 మ్యాచ్లపై ఫిక్సింగ్ ఫిర్యాదులను ఐటీఐఏ అందుకుంది.
ఇక వింబుల్డన్ 2021 మహిళల సింగిల్స్ విజేతగా ప్రపంచ నంబర్వన్, ఆస్ట్రేలియా స్టార్ ఆష్లే బార్టీ నిలిచింది. గత శనివారం జరిగిన ఫైనల్ పోరులో బార్టీ చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కరోలినా ప్లిస్కోవాపై 6-3, 6-7 (4/7), 6-3 తేడాతో విజయం సాధించింది. గత ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నోవాక్ జొకోవిచ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. జకో 6-7 (4/7), 6-4, 6-4, 6-3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు.