లండన్: కరోనా వైరస్ మహమ్మారినేపథ్యంలో బ్రిటన్లో ఇంకా లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక డెల్టా వేరియంట్ కూడా అక్కడ మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఈ నెల చివరలో వింబుల్డన్ 2021 టెన్నిస్ టోర్నీ ప్రారంభంకానున్నది. అయితే వచ్చే నెలలో జరగనున్న వింబుల్డన్ పురుష, మహిళల ఫైనల్స్కు మాత్రం పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. జూలై 10, 11వ తేదీల్లో జరిగే ఫైనల్ మ్యాచ్లకు స్టేడియం సామర్ధ్యానికి తగినట్లు ప్రేక్షకులను అనుమతించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వింబుల్డన్ 2021 ఫైనల్స్ మినహా టోర్నీలో మిగితా మ్యాచ్లకు 50 శాతం మంది ప్రేక్షకులు హాజరుకానున్నారు. వింబుల్డన్ టోర్నీ ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. మ్యాచ్లను తిలకించేందుకు ప్రతి రోజు కనీసం 20 వేల మంది ప్రేక్షకులకు వింబుల్డన్ నిర్వహకులు అనుమతి ఇవ్వనున్నారు. సెంటర్ కోర్టులో జరిగే ఫైనల్ మ్యాచ్లకు మాత్రం పూర్తి సామర్థ్యంతో స్టేడియం నిండి ఉంటుందని అధికారులు చెప్పారు.
WTC Final 2021: జడేజాకు షాక్..ఇద్దరు తెలుగోళ్లకు చోటు!సంజయ్ మంజ్రేకర్ తుది జట్టు ఇదే!
ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ 2021కు కూడా పరిమిత సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన విషయం తెలిసిందే. ఈ టోర్నీని నిర్వాహకులు ఎలాంటి అవరోధాలు లేకుండా నిర్వహించారు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ 6-7(6/8),2-6,6-3,6-2,6-4 తో ఐదో సీడ్ స్టెఫనోస్ సిట్సిపస్ (గ్రీస్)పై గెలుపొందాడు. 4 గంటలా 11 నిమిషాల పాటు సాగిన పోరులో 34 ఏళ్ల జొకోవిచ్ జోరు ముందు 22 ఏళ్ల సిట్సిపస్ నిలువలేకపోయాడు. ఇక మహిళల విభాగంలో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా 6-1, 2-6, 6-4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై అద్భుత విజయాన్నందుకుంది.
మరోవైపు యూరో 2020 నాకౌట్ మ్యాచ్లకు కూడా ప్రేక్షకులను అనుమతించనున్నారు. నాకౌట్ దశలో వెంబ్లే స్టేడియంలోకి 40 వేల మంది అభిమానులకు పర్మిషన్ ఇచ్చారు. రగ్బీ లీగ్స్ చాలెంజ్ కప్ ఫైనల్, సాండ్విచ్లో ఓపెన్ గోల్ఫ్ టోర్నీ, సిల్వర్స్టోన్ గ్రాండ్ ప్రీ టోర్నీలకు కూడా ప్రేక్షకులను అనుమతించనున్నారు.