75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి:
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్ 29 నుంచి జూలై 12వ తేదీ వరకు టోర్నీ జరగాల్సింది. కానీ.. కరోనా వల్ల రద్దవుతున్న టోర్నీల జాబితాలో చేరింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రాండ్ స్లామ్ రద్దు చేయడం ఇదే తొలిసారి. వచ్చే ఏడాది వింబుల్డన్ టోర్నీని జూన్ 28 నుంచి జులై 11 మధ్య నిర్వహించనున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ ప్రపంచ క్రీడల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు ఈ వైరస్ కారణంగా రద్దయ్యాయి.
ఎంతగానో బాధించింది:
ఈ నిర్ణయం అంత తేలిగ్గా తీసుకోలేదని ఏఈఎల్టీసీ ఛైర్మన్ ఇయాన్ హీవిట్ తెలిపారు. 'ఛాంపియన్షిప్ రద్దు చేయాలన్న నిర్ణయం మా మనస్సులను ఎంతగానో బాధించింది. ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధాల కారణంగా మాత్రమే టోర్నీలు రద్దయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉన్నందున ఈ ఏడాది ఛాంపియన్షిప్ రద్దు అనేది సరైన నిర్ణయం అని భావిస్తున్నాం' అని ఇయాన్ పేర్కొన్నారు.
యుద్ధ ప్రభావంతో రద్దు:
వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ 1877లో ప్రారంభమైంది. ప్రతి ఏడాది జరుగుతుండేది. మొదటి ప్రపంచ యుద్ధంతో 1915-18 మధ్య, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940-45 మధ్య జరుగలేదు. ఆ తర్వాత మళ్లీ 75 ఏళ్లకు కరోనా కారణంగా ఇప్పుడు రద్దయింది. కరోనా వైరస్తో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వింబుల్డన్ టోర్నీ రద్దు కావడంతో జూలై 13 వరకు ఎలాంటి టెన్నిస్ టోర్నీలు లేవని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తెలిపాయి.