
అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ వింబుల్డన్లో సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. పదకొండో సీడ్ సెరెనాతో పాటు ఏడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఎనిమిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో సెరెనా 6-4, 4-6, 6-3తో అలిసన్ రిస్కె (అమెరికా)పై శ్రమించి గెలిచింది. సెరెనా 2 గంటల ఒక నిమిషం పాటు జరిగిన ఈ పోరులో చివరకు పోరాడి విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్లో సెరెనా 19 ఏస్లతో పాటు 49 విన్నర్లు కొట్టడం విశేషం. దీంతో వింబుల్డన్ ఓపెన్లో 12సారి సెమీస్ చేరిన సెరెనా 24వ గ్రాండ్స్లామ్ టైటిల్పై కన్నేసింది. వింబుల్డన్ కోర్టులపై సెరెనాకు ఇది 97వ విజయం.
మిగతా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో సిమోనా హలెప్ (హంగేరి) 7-6 (7-4), 6-1తో జంగ్ (చైనా)పై గెలిచి సెమీస్ చేరింది. ఎనిమిదో సీడ్ స్వితోలినా 7-5, 6-4తో ముచోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి ముందంజ వేసింది. మరో మ్యాచ్లో బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 7-6 (7-5), 6-1తో బ్రిటన్ క్రీడాకారిణి జొహనా కొంటా జోరుకు చెక్ పెట్టింది. 17 ఏళ్లుగా వింబుల్డన్ బరిలో దిగుతున్న ఆమె ఒకే ఒక్కసారి క్వార్టర్స్ (2014) చేరింది. గురువారం జరిగే సెమీఫైనల్స్లో స్ట్రికోవాతో సెరెనా; స్వితోలినాతో హలెప్ ఆడతారు.