ఫైనల్ సమయాన్ని మార్చే ప్రసక్తే లేదు
వచ్చే ఆదివారం జరిగే వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ సమయాన్ని మార్చే ప్రసక్తే లేదని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయీస్ స్పష్టంజేశారు. పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లండన్లో ఆదివారం మధ్యా హ్నం 2 గంటలకు మొదలుకానుంది. అయితే అదేరోజు సాయంత్రం 4 గంటలకు (యూకే సమయం ప్రకారం) ఫిఫా ప్రపంచ కప్ వరల్డ్ కప్ ఆరంభం కానుంది.
క్రొయేషియాపై ఇంగ్లండ్ గెలిచి ఫైనల్కు అర్హత సాధిస్తే
ఒకవేళ బుధవారంనాటి సెమీస్లో క్రొయేషియాపై ఇంగ్లండ్ గెలిచి ఫైనల్కు అర్హత సాధిస్తే ఆ దేశ అభిమానులకు మరింత ఇబ్బందే. ఆదివారం నాడు అటు ప్రపంచ కప్ ఫైనల్.. ఇటు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైట్ సమాంతరంగా జరుగుతాయి. రెండు మ్యాచ్లను తిలకించడం ఎలా అన్న వాదనను క్రీడా ప్రేమికులు, ఫుట్బాల్ అభిమానులు లేవనెత్తారు.
మధ్యాహ్నాం రెండు గంటలకే వింబుల్డన్ ఫైనల్
దీంతో వింబుల్డన్ ఫైనల్ సమయంలో మార్పులు చేయాలని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ మీద ఒత్తిడి వచ్చినా నిర్వాహకులు మనసు మార్చుకోలేదు. మధ్యాహ్నాం రెండు గంటలకే వింబుల్డన్ ఫైనల్ జరగాలనేది తమ నిర్ణయమని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయీస్ తెలిపాడు.
రెండు గంటలకే ఫైనల్ జరుగుతుంది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "సంప్రదాయం ప్రకారం రెండు గంటలకే ఫైనల్ జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా ఆ టైమ్కే నిర్వహిస్తాం" అని స్పష్టం చేశాడు. అలాగే వింబుల్డన్ టెన్నిస్ సెంటర్ కోర్టులో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్పై వరల్డ్కప్ సెమీస్, ఫైనల్ మ్యాచ్లు కానీ ప్రసారం చేసే విషయంపైనా నిర్ణయం తీసుకోలేదని అన్నాడు.