
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా క్రీడాలోకం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా క్రీడా టోర్నీలు రద్దు, వాయిదా పడటమో జరిగాయి. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక లాక్డౌన్ కారణంగా క్రీడాకారులందరూ తమ ఇంటి సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఇంట్లో తాము చేసే పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంటున్నారు.
భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా కూడా లాక్డౌన్ సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేస్తోంది. అయితే దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రధాని నరేంద్ర మోదీ.. లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించారు. దీంతో సానియా మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ఆటను చాలా మిస్సవుతున్నా అని, టెన్నిస్ను మళ్లీ ఆడేందుకు వేచిచూస్తున్నా అని పేర్కొంది. 'టెన్నిస్ ఎప్పుడు ఆడుదామని వేచిచూస్తున్నా' అని ఓ ఫొటోకు కాప్షన్ రాసుకొచ్చింది.
ఫొటోలో సానియా మీర్జా గోడకు ఎదురుగా కూర్చుని ఒక చేతిలో టెన్నిస్ రాకెట్ పట్టుకొని ఉండగా.. చుట్టూ బంతులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది. దాదాపు రెండేండ్ల విరామం తర్వాత ఈ ఏడాది జనవరిలో సానియా మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టగా.. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా మరోసారి ఆమెకు ఆట నుంచి విరామం వచ్చింది. కరోనా కారణంగా ఉపాధి కరువైన వారి కోసం అందరు ముందుకు రావాలంటూ సానియా సూచించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయాన్ని సెలెబ్రిటీలు వంటల వీడియోలుపోస్ట్ చేసేందుకు కాకుండా.. పేదలకు సహాయపడే విధంగా ఉండాలంటూ ట్వీట్ చేసింది.
సానియా మీర్జా, పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్మన్ షోయబ్ మాలిక్లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. షోయబ్-సానియాల వివాహం జరిగి గత ఆదివారానికి (ఏప్రిల్ 12) పదేళ్లయింది. తమ పదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సానియా తన భర్త షోయబ్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఆ ఫొటోలకు సానియా సరదా కామెంట్స్ పెట్టింది. షోయబ్ మాలిక్కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. పెళ్లైన పదేళ్ల తర్వాత పరిస్థితి ఇదీ అని పేర్కొంది.