|
రూల్స్ బ్రేక్:
అడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో ఆడి వైరస్ బారిన పడిన ఆటగాళ్లు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు టోర్నీలో ఆడిన మిగతా ఆటగాళ్లను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని టెన్నిస్ సంఘం, ఆ దేశ ప్రభుత్వం సూచించింది. అయితే జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ మాత్రం రూల్స్ బ్రేక్ చేశాడు. సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండకుండా పార్టీ చేసుకున్నాడు. ఒక క్లబ్లో భారీ జన సందోహంలో జ్వెరెవ్ పార్టీ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో అతడు విమర్శల పాలయ్యాడు.
డాన్స్ చేస్తూ క్లబ్లో సందడి:
ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్నందుకు అలెగ్జాండర్ జ్వెరెవ్.. జర్మనీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. అభిమానులకు క్షమాపణలు చెప్పి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటానని మాటిచ్చాడు. సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండకుండా ఎంచక్కా పార్టీ చేసుకున్నాడు. డాన్స్ చేస్తూ క్లబ్లో సందడి చేశాడు. వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విషయం తెలుసుకున్న జెర్మనీ ప్రజలు జ్వెరెవ్ను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు.
సెల్ఫ్ ఐసోలేషన్ అంటే ఇదేనా:
'ఒక ప్రైవేట్ క్లబ్లో జ్వెరెవ్ చిందులు వేస్తూ కనిపించడం క్లియర్గా కనిపించింది. ఇదేనా సెల్ఫ్ ఐసోలేషన్ అంటే' అంటూ ఒకరు విమర్శించగా.. 'ఆరు రోజుల క్రితం ఏమి చెప్పావ్ జ్వెరెవ్.. ఇప్పుడు ఏమి చేస్తున్నావ్' అంటూ మరొకరు మండిపడ్డారు. 'ఆటగాళ్లు రూల్స్ ఫాలో కావడంలేదనే దానికి ఇదొక ఉదాహరణ. ఇది చాలా బాధపెట్టే అంశం. మిగతా వారిని కూడా ప్రమాదంలోకి నెట్టడం భావ్యమా' అని మరొకరు విమర్శించారు. 'పబ్లిక్కు సంబంధించి గైడ్లైన్స్ ఉన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా.. ఇదే ఒక సెలబ్రెటీగా నువ్వు ఇచ్చే సందేశం' అని అభిమానులు విరుచుకుపడుతున్నారు.
సెర్బియా అంచె పోటీలు ముగిశాక:
అడ్రియా టూర్లో సెర్బియా అంచె పోటీలు ముగిశాక.. క్రొయేషియాలో రెండో అంచె పోటీలు నిర్వహిస్తుండగా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఫైనల్ మ్యాచ్ను రద్దు చేశారు. ఇక నిర్వాహకుడు, ఆటగాడు జొకోవిచ్ సహా మరో ముగ్గురు ప్లేయర్లు దిమిత్రోవ్, కోరిచ్, ట్రయోకీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగానే ఉండడం సంతోషకర విషయం.