హైదరాబాద్: అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ కారు జూన్ 9వ తేదీన ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన జెరోమ్ బార్సన్ (79) అనే వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వారాల తర్వాత మృతి చెందాడు.
ఈ నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ రోడ్డు ప్రమాద ఘటనలో వీనస్ విలియమ్స్ పాత్రపై స్పందించారు. పామ్ బీచ్ గార్డెన్స్ పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జూన్ 9న ఫ్లోరిడాలో వీనస్ విలియమ్స్ నడుపుతున్న కారు ప్రమాదవశాత్తూ మరో కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 79 ఏళ్ల వృద్ధుడు జెరోమ్ బార్సన్ తీవ్రంగా గాయపడ్డాడు. కారు నడుపుతున్న జెరోమ్ భార్య లిండా బార్సన్ కూడా గాయపడటంతో స్థానికులు వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయమైన జెరోమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 14 రోజుల తర్వాత మరణించాడు.
దీంతో పామ్ బీచ్ గార్డెన్ సిగ్నల్ వద్ద వేచి చూస్తుండగా, నిబంధనలు ఉల్లంఘించి, వీనస్ కారుతో ఢీ కొట్టిందని జెరోమ్ బార్సన్ భార్య లిండా బార్సన్ తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. కారు నడుపుతున్న సమయంలో వీనస్ విలియమ్స్ ఫోన్ మాట్లాడటం, డ్రగ్స్, ఆల్కహాల్ లాంటివి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఎదురుగా ఉన్న లిండా బార్సన్ కారును చూడలేకపోయానని వీనస్ తెలిపిందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో జెరోమ్ ప్రాణాలు కోల్పోయాడని, ఆయన మృతికి వీనస్ ప్రగాఢ సానుభూతి తెలిపిందని వీనస్ అటార్నీ మాల్కమ్ తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతోందని ఆయన అన్నారు.
దీంతో వీనస్ కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఆమె కావాలని ఈ యాక్సిడెంట్ జరపకపోయినా, ఆమె కారణంగా యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు చెబుతుండడంతో ఆమె కెరీర్పై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక, సోమవారం నుంచి ఇంగ్లాండ్లో ప్రారంభం కానున్న వింబుల్డన్ టోర్నీలో వీనస్ పదో సీడ్గా బరిలోకి దిగుతుంది.