న్యూయార్క్: అమెరికన్ టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్.. రిటైర్మెంట్ సంకేతాలు పంపించారు. వచ్చే ఏడాది యూఎస్ ఓపెన్ టోర్నమెంట్లో ఆడట్లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. తన కేరీర్లో చివరి సింగిల్స్ టెన్నిస్ మ్యాచ్ ఇదే కావొచ్చని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని వెల్లడించే సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు..కన్నీటి పర్యంతం అయ్యారు. వచ్చే ఏడాది యూఎస్ ఓపెన్ ఆడటం తన చేతుల్లో లేదని పేర్కొన్నారు.
న్యూయార్క్లోని అర్థర్ ఆషె స్టేడియం వేదికగా ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోన్న యూఎస్ ఓపెన్ 2022 మూడో రౌండ్లో సెరెనా విలియమ్స్ ఓటమి చవి చూశారు. తొలి రెండు రౌండ్లల్లో అలవోకగా విజయం సాధించినప్పటికీ.. మూడో రౌండ్లో ఆ దూకుడును కొనసాగించలేకపోయారు. పరాజయాన్ని చవి చూశారు. ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టోమ్లానోవిక్తో చేతిలో 7-5, 6-7 (4), 6-1 తేడాతో ఓడిపోయారు.
తన కేరీర్లో ఆరు యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ను సాధించిన సెరెనా. ఇప్పటివరకు మొత్తంగా 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. గేమ్ ముగిసిన తరువాత ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎమోషన్ అయ్యారు. తన టెన్నిస్ కెరీర్ను ముగించడానికి సిద్ధమవుతున్నానని చెప్పారు. ఇప్పటివరకు ఆరు యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించానని, ఇకపై ఈ సంఖ్య పెరగకపోవచ్చని వ్యాఖ్యానించారు.
ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ, తన అభిమానులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని సెరెనా చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా తనను ఆదరించారని, తన రిటైర్మెంట్ తరువాత అదే ఆదరాభిమానాలు కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రత్యేకించి- తన సోదరి వీనస్ విలియమ్స్కు ఆమె థ్యాంక్స్ చెప్పారు. వీనస్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, ఆమె లేకపోతే తాను లేనని చెప్పారు. తల్లిదండ్రులు తమ ఇద్దరినీ సమానంగా ప్రోత్సహించారని పేర్కొన్నారు.