యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. టైటిల్ పోరు కోసం ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ జానిక్ సినర్తో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ అమీతుమి తేల్చుకోనున్నాడు. సెమీఫైనల్లో జాక్ డ్రేపర్ (బ్రిటన్)పై సినర్, ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై ఫ్రిట్జ్ విజయం సాధించి ఫైనల్కు చేరుకున్నారు.
డ్రేపర్ను ఇటలీ ప్లేయర్ సినర్ 7-5, 7-6 (7/3), 6-2 ఓడించి తుది పోరుకు అర్హత సాధించాడు. కాగా, ఈ క్రమంలో సినర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్స్కు చేరిన తొలి ఇటలీ ప్లేయర్గా చరిత్రకెక్కాడు. మరోవైపు టియాఫోపై 4-6, 7-5, 4-6, 6-4, 6-1 తేడాతో ఫ్రిట్జ్ విజయం సాధించాడు.

కాగా, గత 15 ఏళ్లలో గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్స్కు చేరిన తొలి అమెరికా ప్లేయర్గా ఫ్రిట్స్ అరుదైన ఘనత సాధించాడు. 2009 తర్వాత గ్రాండ్స్లామ్ ఫైనల్స్కు ఫ్రిట్జ్ మినహా ఏ అమెరికా ప్లేయర్ అర్హత సాధించలేదు. 2009 వింబుల్డన్ టోర్నీలో ఆండీ రాడిక్ ఫైనల్స్ ఆడాడు. ఇక ఫ్రిట్జ్కు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్.
ఆదివారం జరగనున్న తుదిపోరులో సినర్ను ఓడిస్తే.. 2003 తర్వాత యూఎస్ ఓపెన్లో మెన్స్ సింగిల్స్ గెలిచిన మొదటి అమెరికా ప్లేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. పురుషుల సింగిల్స్లో 2003లో ఆండీ రాడిక్ యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచాడు. మరోవైపు మహిళల సింగిల్స్ ఫైనల్స్లో బెలారస్ స్టార్ అర్యానా సబలెంక, అమెరికా ప్లేయర్ జెస్సికా పెగులా పోటీపడనున్నారు.
గ్రాండ్స్లామ్ కెరీర్లో జెస్సికాకు ఇదే తొలి ఫైనల్స్. కాగా, యూఎస్ ఓపెన్లో సబలెంక ఫైనల్స్కు చేరడం వరుసగా ఇది రెండో సారి. గతేడాది కూడా టైటిల్ పోరుక అర్హత సాధించింది. కానీ రన్నరప్గా నిలిచింది. 2023, 2024లో సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గింది. ఆదివారం తెల్లవారుజామున మహిళల సింగిల్స్ ఫైనల్ జరగనుంది.