యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విజేతగా బెలారస్ స్టార్ అర్యానా సబలెంక నిలిచింది. గతేడాది తుదిమెట్టుపై బోల్తాపడి యూఎస్ ఓపెన్ టైటిల్ను చేజార్చుకున్న సబలెంక ఈసారి ఛాంపియన్గా అవతరించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఫైనల్లో అమెరికా ప్లేయర్ జెస్సికా పెగులాపై 7-5, 7-5తో వరుస సెట్లను గెలిచింది.
గతేడాది యూఎస్ ఓపెన్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంక.. కొకొగాఫ్ చేతిలో ఓటమిపాలై రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, 26 ఏళ్ల సబలెంకకు ఇది మొదటి యూఎస్ ఓపెన్ టైటిల్. కెరీర్లో ఓవరాల్గా మూడో గ్రాండ్ స్లామ్. 2023, 2024 సీజన్లలో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్ను గెలిచింది.

విజయానంతం సబలెంక మాట్లాడుతూ.. ''ఓ మై గాడ్, నాకు మాటలు రావట్లేదు. ఎన్నోసార్లు ట్రోఫీకి దగ్గరగా వచ్చాను. ఇది నా కల. మొత్తంగా ఈ అందమైన ట్రోఫీని అందుకున్నాను. ఫైనల్లో ఓడితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. జెస్సికా గొప్పగా ఆడింది. భవిష్యత్లో జెస్సికా తప్పక టైటిల్ గెలుస్తుంది. ఇక పట్టుదలతో శ్రమిస్తే మన కలను తప్పక అందుకుంటాం'' అని పేర్కొంది.
కాగా, ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచిన సబలెంక ట్రోఫీతో పాటు 3.6 మిలియన్ డాలర్లను అందుకుంది. రన్నరప్గా నిలిచిన జెస్సికా పెగులా 1.8 మిలయన్ డాలర్లు గెలుచుకుంది. జెస్సికా తొలిసారి క్వార్టర్స్ను అధిగమించి అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరింది.