
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ 2020లో మరో సంచలనం నమోదయ్యింది. దాదాపు 26 ఏళ్ల తర్వాత జర్మనీకి చెందిన ఓ ఆటగాడు యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. న్యూయార్క్లో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్.. స్పెయిన్ ఆటగాడు పబ్లో కారెనో బస్టాపై అద్భుత విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో ఓ దశలో ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో.. అద్భుతంగా పోరాడి విజయాన్నిఅందుకున్నాడు.
మొదటి రెండు సెట్లలో తడబడిన అలెగ్జాండర్ జ్వెరెవ్.. తర్వాత వేగం అందుకున్నాడు. చివరకు కారెనో బస్టాపై 3-6, 2-6, 6-3, 6-4, 6-3తో జయకేతనం ఎగురవేశాడు. మొదటి రెండు సెట్లలో జ్వెరెవ్ కనీస పోరాట పటిమ కూడా కనబర్చలేకపోయాడు. దీంతో అతడి ఓటమి ఖాయం అనుకున్నారు. అయితే ఒక్కసారిగా లయ అందుకున్న జ్వెరెవ్.. ఆపై మూడు సెట్లలో బస్టాపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ.. ఏకంగా మ్యాచును సొంతం చేసుకున్నాడు.
ఈ విజయంతో 1994 తర్వాత యూఎస్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్కు చేరుకున్న మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ జ్వెరెవ్ నిలిచాడు. 1994లో మైఖేల్ స్టిచ్ యూఎస్ ఫైనల్లో ఆడాడు. 26 ఏళ్ల తర్వాత జ్వెరెవ్ యూఎస్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్ ఆడనున్నాడు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో ఐదో సీడ్ జ్వెరెవ్.. డొమినిక్ థీమ్తో తలపడనున్నాడు.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో విక్టోరియా అజరెంక (బెలారస్) 1-6, 6-3, 6-3తో ఆరుసార్లు ఛాంపియన్, మూడోసీడ్ సెరెనా విలియమ్స్ను ఓడించింది. ఈ సమరంలో ఆరంభం సెరెనాదే. శక్తివంతమైన సర్వీసులు, విన్నర్లతో విరుచుకుపడిన 39 ఏళ్ల విలియమ్స్ తొలి సెట్ను 6-1తో సులభంగా చేజిక్కించుకుంది. కానీ రెండో సెట్ నుంచి అజరెంక గొప్పగా పుంజుకోగా.. సెరెనా అనూహ్యంగా తడబడింది. ఇక నవోమి ఒసాకా కష్టపడి ఫైనల్లో ప్రవేశించింది. సెమీఫైనల్లో ఆమె 7-6 (7/1), 3-6, 6-3తో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)పై గెలిచింది. మహిళల సింగల్స్ ఫైనల్ శనివారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1.30కు ఆరంభమవుతుంది.