హైదరాబాద్: టెన్నీస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జాకు, ఆమె భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ల మధ్య ఎలాంటి గొడవలు, విభేదాలు లేవని, వారు తమ వివాహ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారని సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా అన్నారు. ఇటీవల ఓ మేగజైన్లో వచ్చిన కథనంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
షోయబ్ మాలిక్, సానియా మీర్జాల మధ్య విబేధాలు, గొడవలు జరుగుతున్నాయని, వారిద్దరూ విడిపోయే అవకాశాలున్నట్లు ఆ మేగజైన్లో కథనం రావడంతో ఇమ్రాన్ మీర్జా దానికి కౌంటర్ ఇచ్చాడు. నాలుగేళ్ల తర్వాత షోయబ్, సానియాల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయని, ఆ జంట త్వరలోనే విడిపోయే అవకాలున్నాయని మేగజైన్ కథనం పేర్కొంది.
అంతేగాక షోయబ్ మాలిక్ క్రికెట్ జీవితం చాలా పేలవంగా ఉండటం కూడా ఈ విభేదాలకు కారణమని మేగజైన్ తన కథనం వెల్లడించింది. చాలా మంది సన్నిహితులు కలిసి సానియా, షోయబ్ల మధ్య రాజీని కుదిర్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారని మేగజైన్ పేర్కొంది. కాగా సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా మాత్రం ఈ కథనంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. మేగజైన్ కథనాన్ని ఆయన తప్పుపట్టారు.
తాను మేగజైన్ కథనం గురించి విన్నానని, అదంతా ఒక అర్థంలేని చర్యగా అభివర్ణించారు. తమ కూతురు, ఆమె భర్త ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ పర్యటనల్లో కూడా కలిసే ఉన్నారని చెప్పారు. అయితే వారిద్దరూ కలిసి మీడియా కంటపడనంతా మాత్రాన, వారు విడిపోతున్నారని అనుకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. వారి వివాహ జీవితం సంతోషంగా సాగుతోందని ఇమ్రాన్ మీర్జా తెలిపారు.