

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆమెపై నెటిజన్లు ట్రోలింగ్కు పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.
ఈ ఉగ్రదాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం నాటికి ఆ సంఖ్య 44కు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఘటన జరిగిన రోజున సానియా మిర్జా తాజాగా తీసుకున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
దీంతో "పుల్వామా ఉగ్రదాడి గురించి స్పందించకుండా ఇలా ఫోటోలు పోస్ట్ చేస్తావా?" అంటూ పలువురు నెటిజన్లు ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నీ ఫోటో చూసే ఆసక్తి మాకు లేదు. అంత పెద్ద దాడి జరిగితే దాని గురించి కనీసం స్పందించకుండా ఇలా ఫోటోలు అప్లోడ్ చేస్తావా" అంటూ ఓ నెటిజన్ ఆ ఫోటో కింద కామెంట్ పెట్టాడు.
మరొక నెటిజన్ అయితే "సిగ్గులేదు, స్వార్థం.. నువ్వు భారతీయురాలివేనా? దేశ రక్షణ వ్యవస్థపై జరిగిన దాడిని పట్టించుకోవా" అంటూ కామెంట్ పెట్టాడు. "ఆమె పాకిస్థాన్కు చెందిన మహిళ. ఈ దాడి గురించి స్పందించడానికి ఆమె ఇష్టపడదు" అంటూ మరొక నెటిజన్ సానియా మిర్జాను ఉద్దేశించి పరుష పదజాలంతో విమర్శించాడు.