హైదరాబాద్: టెన్నిస్ సూపర్స్టార్ సెరెనా విలియమ్స్ తనపై వస్తున్న విమర్శలపై మండిపడ్డారు. 23 గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ అమెరికన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ ఇటీవల జరిగిన వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, టోర్నమెంట్లలో తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. సొంతదేశం అమెరికాలో జూలై 31న జరిగిన చారిత్రక శాన్జోస్ సిలికాన్ వ్యాలీ క్లాసిక్ టోర్నీలో సైతం ఓటమి చవిచూశారు.
సెరెనా 2017లో కూతురు అలెక్సిస్ ఒలంపియా ఒహానియన్ జూనియర్కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ ఏడాదిలో తిరిగి కోర్టులోకి అడుగుపెట్టిన సెరేనా సరిగా ఆడలేపోయింది. ఏకంగా 12గేమ్స్లో ఫైనల్ వరకూ వచ్చి ఓడిపోయింది. శాయశక్తులా పోరాడి తన టాప్ ఫామ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాను ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఫలితం రాకపోవడంతో ఆమెపై వస్తున్న రూమర్లు హద్దు మీరాయి.
అమ్మ అయిన తర్వాత ఆటలో వెనకబడడంతో ఆమెపై వస్తున్నవిమర్శలపై స్పందించారు. అందరిలాగే తాను కూడా ఓ తల్లినేనని గుర్తుచేశారు. ప్రసవానంతర ఉద్వేగాలతో సతమతమవుతున్నాని తెలిపారు. కొన్ని సార్లు తన కూతురుతో కొద్ది సమయం కూడా గడపలేక పోవడం బాధిస్తోందని అన్నారు. అదేమీ అర్థం చేసుకోకుండా నోటికొచ్చింది రాసేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.
సెరెనాను విమర్శిస్తున్న వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారనీ, బిడ్డకు జన్మనిచ్చిన వారెవరైనా మళ్లీ మాములు జీవనం సాగించడం అంత సులువు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ అయిన సెరెనా.. విమర్శలకు బదులిచ్చే తీరిక తనకు లేదని ఇదివరకే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.