హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రోత్సాహం వల్లే యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించగలిగానని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ గెలుచుకున్న ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన అధికారిక నివాసంలో మంగళవారం కలిసింది.
ఈ సందర్భంగా సానియాను కెసిఆర్ అభినందించారు. ఆమె సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. సానియా భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రభుత్వం తరఫునుంచి అందుకు అవసరమైన సాయాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. త్వరలోనే ప్రభుత్వం తరఫున సానియాను సన్మానిస్తామని చెప్పారు.

కెసిఆర్తో భేటీలో చాముండేశ్వరీ నాథ్ కూడా సానియా వెంట ఉన్నారు. యుఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన తర్వాత తిరిగి వచ్చిన సానియాకు ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే.
సానియాకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్వాగతం పలికింది. తన విజయం తెలంగాణకు, భారతదేశానికి అంకితమని కూడా ఆమె చెప్పారు.