పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026 మార్చి 31న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ చేరిక బీజేపీకి అదనపు బలాన్నిచ్చింది. యువతను ఆకర్షించే వ్యూహాత్మక అడుగుగా పార్టీ భావిస్తోంది. లియాండర్ పేస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తూ యువ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతారని బీజేపీ నమ్ముతోంది.
లియాండర్ పేస్ 1973 జూన్ 17న కోల్కతాలో క్రీడా నేపథ్యమున్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకట్రామన్ 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో హాకీ కాంస్యం సాధించగా, తల్లి జెన్నిఫర్ 1980 ఆసియా బాస్కెట్బాల్ జట్టుకు నాయకత్వం వహించారు. గత ఏడాది ఆయన తండ్రి కన్నుమూశారు.పేస్ 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో బ్రెజిల్కు చెందిన ఫెర్నాండో మెలిగెనిని ఓడించి కాంస్యం గెలిచారు. వ్యక్తిగత ఒలింపిక్ పతకం సాధించిన కేడీ జాదవ్ తర్వాత తొలి భారతీయుడు ఆయనే. ఆయనకు 1990 అర్జున, 1996 ఖేల్ రత్న, 2001 పద్మశ్రీ, 2014 పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి.

పురుషుల సింగిల్స్లో గ్రాండ్స్లామ్లు లేకున్నా డబుల్స్లో పేస్ చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్లో మొత్తం ఎనిమిది గ్రాండ్స్లామ్ టైటిళ్లు (2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ సహా పలుమార్లు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) కైవసం చేసుకున్నారు. మిక్స్డ్ డబుల్స్లో ఆయన పది గ్రాండ్స్లామ్ టైటిళ్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. మూడు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఒక ఫ్రెంచ్ ఓపెన్, నాలుగు వింబుల్డన్, రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు ఇందులో ఉన్నాయి. ఈ అద్భుత రికార్డు ఆయన్ని టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ డబుల్స్ ఆటగాళ్లలో ఒకరిగా నిలబెట్టింది.