లండన్, జులై 8: అమెరికా నల్లకలువగా మద్దుగా పిలుచుకునే 'సెరెనా విలియమ్స్' శనివారం తన కెరీర్లో ఐదవ వింబుల్డన్ టైటిల్ను గెలుచుకుంది. యువ క్రీడాకారిణులకు దీటుగా, తనలో ఇంకా పోరాటపటిమ మిగిలి ఉందని... ఈ 'గ్రాండ్' విజయంతో సెరెనా చాటిచెప్పింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆరో సీడ్ సెరెనా 6-1, 5-7, 6-2తో మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్స్కా (పోలండ్)పై విజయం సాధించింది. తన కెరీర్లో ఐదోసారి వింబుల్డన్ సింగిల్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేతగా నిలిచిన సెరెనాకు 11 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 86 లక్షలు); రన్నరప్ రద్వాన్స్కాకు 5 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 4 కోట్ల 93 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి.

మొదటి సెట్లో తన ప్రత్యర్థిని కేవలం 36 నిమిషాలలో సునాయాసంగా చిత్తు చేసిన సెరెనా రెండవ సెట్లో మాత్రం ఆమె నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంది. రెండవ సెట్లో ఆదిలోనే రద్వాన్స్కా సర్వ్ను బ్రేక్ చేసిన తరువాత సెరెనా ఆట అధ్వానంగా మారింది. రద్వాన్స్కా ఆమె సర్వ్ను రెండు మార్లు బ్రేక్ చేసి సెట్ను కైవసం చేసుకుంది. చివరి సెట్లో కూడా 1-2తో సెరెనా వెనుకబడింది. కాని తరువాత పుంజుకుని సెరెనా వరుసగా చివరి ఐదు గేములను, తద్వారా సెట్ను, మ్యాచ్ను హస్తగతం చేసుకుంది. కాగా సెరెనాకు ఇది 14వ గ్రాండ్ శ్లామ్ టైటిల్.
మ్యాచ్ అనంతరం 'ఈ విజయాన్ని ఎలా వర్ణించాలో అర్ధం కావడంలేదు. కొన్నాళ్ల క్రితం ఇక్కడకు మళ్లీ వస్తాననుకోలేదు. అప్పుడు ఆసుపత్రిలో ఉన్నాను. ఇప్పుడు వింబుల్డన్కు వచ్చాను. మళ్లీ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విజయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడూ చేతులెత్తేయకూడదు. నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఇన్నాళ్లూ నా వెన్నంటే ఉన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని ఫైనల్ ముగిసిన అనంతరం భావోద్వేగంతో సెరెనా వ్యాఖ్యానించింది.
ఈ విజయం ద్వారా 'వీనస్ రోజ్వాటర్ డిష్'ను సాధించిన సెరెనా 1990 తరువాత వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్న 30 పైబడిన తొలి క్రీడాకారిణి అయింది. 1990లో మార్టినా నవ్రతిలోవా ఈ ఘనత సాధించింది. వింబుల్డన్లో సెరెనా-వీనస్ డబుల్స్ బరిలోకి దిగిన ప్రతిసారీ సింగిల్స్లోనూ ఈ ఇద్దరిలో ఒకరు విజేతగా నిలిచారు. ఈ ఏడాది వింబుల్డన్లో సెరెనా 102 ఏస్లు సంధించింది. తద్వారా ఒకే గ్రాండ్స్లామ్ టోర్నీలో అత్యధిక ఏస్లు సంధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
తెలుగు వన్ఇండియా