న్యూఢిల్లీ, జూన్ 27: లండన్ ఒలింపిక్స్లో ఆడేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు లైన్ క్లియరైంది. ఒలింపిక్స్ కోసం మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జాకు వైల్డ్ కార్డు విషయమై చాలా రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు మంగళవారం తెర పడింది. మహిళల డబుల్స్లో సానియా-రష్మీ చక్రవర్తిల జోడీకి ఐటీఎఫ్ వైల్డ్కార్డ్ ఇచ్చింది. దీంతో సానియా మిక్స్డ్ డబుల్స్లోనూ ఆడేందుకు మార్గం సుగమమైంది.

మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఆడేందుకు సోమ్దేవ్ దేవ్వర్మన్కు వైల్డ్కార్డ్ ఎంట్రీ లభించింది. భారత్ ఇప్పటికే పురుషుల డబుల్స్ విభాగంలో రెండు ఎంట్రీలను పంపింది. దీంతో మొత్తం ఒలింపిక్స్లో పాల్గొనే భారత టెన్నిస్ క్రీడాకారుల సంఖ్య ఏడుకు చేరింది. సానియా జోడీకి, సోమ్దేవ్కు వైల్డ్కార్డ్ ఇస్తున్నట్లు మంగళవారం నాడు ఐటీ ఎఫ్ అధ్యక్షుడి నుంచి ఏఐటీఏకు సమాచారం వచ్చింది.
లండన్ ఒలింపిక్స్లో తనను మిక్స్డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్తో ఆడాలని అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ నిర్ణయించడం పట్ల భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ ఒలింపిక్స్కు వైల్డ్ కార్డు అనుమతి లభించిన తర్వాత సానియా మీర్జా నోరు విప్పారు. మంగళవారం ఓ ప్రకటన జారీ చేసిన సానియా మీర్జా, ఒలింపిక్స్లో లియాండర్ పేస్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఆడే విషయమై హామీనివ్వలేనని తేల్చి చెప్పింది.
విష్ణువర్ధన్ను తనకు జతగా ఎంపిక చేసినందుకు అలకమీదున్న లియాండర్ పేస్... సానియాతో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఆడతానని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ)కు గతంలోనే చెప్పాడు. మరోవైపు భూపతి-సానియా జోడీ ఇటీవల ఫ్రెంచ్ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచినందున ఈ ఇద్దరినే బరిలోకి దించాలనే డిమాండ్ ఉంది. సానియాతో కలిసి మిక్స్డ్లో ఆడే అవకాశం ఇవ్వకపోతే ఒలింపిక్స్కు దూరమవుతానని పేస్ అంటున్నాడు. ఈ నేపథ్యంలో మిక్స్డ్లో సానియాకు జోడీగా ఏఐటీఏ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరం.
తెలుగు వన్ఇండియా